Begin typing your search above and press return to search.

ఆర్నాబ్ ఎంత ప‌ని చేశాడు..!

By:  Tupaki Desk   |   9 May 2017 8:01 AM GMT
ఆర్నాబ్ ఎంత ప‌ని చేశాడు..!
X
టైమ్స్ నౌ ఛాన‌ల్ లో త‌న ప్రోగ్రాం ద్వారా కోట్లాదిమందికి ద‌గ్గ‌రైన ప్ర‌ముఖ పాత్రికేయుడు ఆర్నాబ్ గోస్వామి.. త‌న‌దైన ఛాన‌ల్‌ను షురూ చేయ‌టం తెలిసిందే. రిప‌బ్లిక్ పేరుతో వ‌చ్చిన స‌రికొత్త ఛాన‌ల్‌.. త‌న ఎంట్రీతోనే భారీ సంచ‌ల‌నాల్ని సృష్టించేక‌థ‌నాల్ని ప్ర‌సారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బీహార్ అధికార‌ప‌క్షంలో భాగ‌మైన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కు మంట ప‌ట్టేలా టేపుల్ని విడుద‌ల చేస్తూ ప్ర‌సారం చేసిన క‌థ‌నం రేపుతున్న సంచ‌ల‌నం అంతాఇంతా కాదు.

ఇదిలా ఉంటే.. తాజాగా మాజీ కేంద్ర‌మంత్రి శ‌శిథ‌రూర్ కు షాక్ త‌గిలేలా క‌థ‌నాల్ని ఆ ఛాన‌ల్ ప్ర‌సారం చేస్తోంది. శ‌శిథ‌రూర్ స‌తీమ‌ణి సునంద పుష్క‌ర్ అనుమానాస్ప‌ద మృతిపై మ‌రిన్ని సందేహాలు రేకెత్తించేలా తాజాగా కొన్నిటేపుల్ని రిప‌బ్లిక్ ఛాన‌ల్ రిలీజ్ చేసింది. ఇది పెను సంచ‌ల‌నంగా మారింది. స‌ద‌రు టీవీ ఛాన‌ల్ క‌థ‌నం ప్ర‌కారం సునంద‌పుష్క‌ర్ మ‌ర‌ణించిన రోజున‌.. ఉద‌యం ఆమెతో ప్రేమ శ్రీదేవి అనే పాత్రికేయురాలు మాట్లాడిన‌ట్లుగా పేర్కొన్నారు.

మ‌ర‌ణించిన త‌ర్వాత సునంద పుష్క‌ర్ మృత‌దేహాన్ని ఆమె మ‌ర‌ణించిన ఫైర్ స్టార్ హోట‌ల్లోని ఒక గ‌ది నుంచి మ‌రో గ‌దికి మార్చిన‌ట్లుగా పాత్రికేయురాలు ఆరోపిస్తున్నారు. ఇది పెను సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఈ క‌థ‌నాన్ని శ‌శిథ‌రూర్ తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. పాత్రికేయుడి ముసుగులో నిబ‌ద్ధ‌త లేని క‌థ‌నాన్ని ప్ర‌సారం చేస్తూ.. తీవ్రంగా బాధించే అబ‌ద్ధాలు.. వ‌క్రీక‌ర‌ణ‌లు.. అస‌త్య క‌థ‌నాల‌తో వార్త‌ల్ని ప్ర‌సారం చేస్తున్న‌ట్లుగా శ‌శిథ‌రూర్ ఆరోపిస్తున్నారు.

వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం కోసం.. టీఆర్పీ రేటింగ్ ల కోసం మ‌రీ ఇంత‌లా దిగ‌జారుతారా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. స‌ద‌రు ఛాన‌ల్ మాత్రం ఈ విమ‌ర్శ‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోకుండా.. తాను ప్ర‌సారం చేసిన క‌థ‌నం ఎంత నిజ‌మ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌య్యేలా క‌థ‌నాల మీద క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నారు. తాజాగా ఆ ఛాన‌ల్ కు చెందిన ట్విట్ట‌ర్ పేజీలోనూ.. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఉద‌యం నుంచి ప‌లు పోస్టులు పెట్ట‌టం గ‌మ‌నార్హం.