Begin typing your search above and press return to search.

ఏపీ ప్యాకేజీకి ఇంకో రూపం ఇవ్వ‌నున్న కేంద్రం

By:  Tupaki Desk   |   8 Feb 2017 9:35 AM GMT
ఏపీ ప్యాకేజీకి ఇంకో రూపం ఇవ్వ‌నున్న కేంద్రం
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త ద‌క్కుతుందా లేదా గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన‌ట్లు బీహార్ -జ‌మ్మూకాశ్మీర్ వ‌లే ప్ర‌క‌ట‌న‌ల‌న‌కే పరిమితం అవుతుందా అనే సందేహానికి ఫుల్ స్టాప్ ప‌డింది. ఏపీ ప్ర‌త్యేక ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్ వెల్ల‌డించారు. ఏపీకి ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందేందుకు క్యాబినెట్‌ నోట్‌ తయారీలో ఉందని ఆయ‌న పార్ల‌మెంటులో తెలియ శారు. ఏపీకి ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించిందా?, లేకపోతే జాప్యం జరుగుతుండడానికి కారణాలేమిటని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్ మంత్రివర్గ పరిశీలన కోసం నోట్‌ తయారీలో ఉందని తెలిపారు. విజయవాడ - విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను రాష్ట్ర పుర్వ్యవస్థీకరణ చట్టంలోని పదమూడవ షెడ్యూలులోనే పొందుపరిచినందున ప్రత్యేక ఆర్థిక సహాయంలో చేర్చలేదని వివరించారు. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులలో ఆరు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వాటిని ప్రపంచ బ్యాంక్‌ - ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ, ఆసియా మౌలిక సదుపాయాల బ్యాంక్‌లకు పంపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ మంగళవారంనాడు రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం మొత్తం పదిహేడు ప్రాజెక్టులను విదేశీ రుణాలు - ఆర్థిక సహాయం కోసం ప్రతిపాదించిందని, వాటిలో ఆరింటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ చెప్పారు. విదేశీ ఆర్థిక సహాయ సంస్థల పరిశీలనకు పంపిన ఆరు ప్రాజెక్టులలో అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు (50కోట్ల డాలర్లు) - విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అయభివృద్ధి ప్రాజెక్టు(63కోట్ల డాలర్లు) - ఏపీ ఇరిగేషన్‌ అభివృద్ధి ప్రాజెక్టు (రు.1700కోట్లు) - అందరికీ నిర్విరామ విద్యుత్‌ సరఫరా ప్రాజెక్టు(40కోట్ల డాలర్లు) - రాష్ట్ర సమగ్ర వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టు(రు.1120 కోట్లు) - కరవు నివారణ పనుల ప్రాజెక్టు (7.5కోట్ల డాలర్లు) ఉన్నాయని ఆయన వివరించారు. ఇదిలాఉండ‌గా..... గుంటూరు - కృష్ణా - శ్రీకాకుళం - తూర్పు గోదావరి జిల్లాలలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి రాజ్యసభలో విజ్ఞప్తి చేశారు. జీరో అవర్‌ లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన ఈ జిల్లాల నుండి రోజుకు కనీసం రెండు వేల వాహనాలలో ఇసుక హైద్రాబాద్‌ కు అక్రమంగా తరలిపోతుండడంతో పర్యావరణ, ఆరోగ్య - భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. హంద్రీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులను రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోనవడాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల తప్పుబట్టిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/