Begin typing your search above and press return to search.

కాపుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారా ?

By:  Tupaki Desk   |   11 July 2022 11:30 PM GMT
కాపుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారా ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు విన్న తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏపీ జనాల్లో ప్రాంతీయ బావన లేదన్నారు. ఉన్నదంతా కుల భావన మాత్రమే అంటు మండిపడ్డారు. అయితే ఇక్కడితో ఆగని పవన్ కుల భావన కూడా పూర్తిస్థాయిలో పాటిస్తున్నారా అంటే అదీలేదని బాధపడిపోయారు. సొంత కులం వారినే తిట్టుకుంటూ ప్రభువుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. ఏ కులం వారిని ఆ కులం వారితోనే తిట్టించటం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందన్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే తనకు మద్దతుగా కాపులంతా పోలోమంటు జనసేనలోకి వచ్చేస్తారని పవన్ అనుకున్నట్లున్నారు. అయితే అలా జరగకపోగా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయారు. దాంతో కాపులే పవన్ను ఓన్ చేసుకోలేదన్న విషయం అర్ధమైపోయింది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల సంఖ్య బాగా ఉన్నది కాబట్టి అక్కడ చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయని పవన్ అనుకున్నారు. అందుకనే ఏరికోరి భీమవరంలో పోటీచేశారు.

విచిత్రంగా పవన్ ఓడిపోవటంతో పాటు రాజోలులో మాత్రమే రాపాక వరప్రసాద్ గెలిచారు. రాపాక కూడా జనసేన అభ్యర్ధిగా గెలవలేదు. నేతగా అప్పటికే బాగా పాపులర్ కాబట్టే గెలిచారు. ఇక గాజువాకలో పోటీచేసిన పవన్ అక్కడా ఓడిపోయారు.

అప్పటినుండి పవన్ కు బాగా మంటగా ఉంది. ఇదే సమయంలో నరసాపురంలో మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపులందరినీ జనసేనవైపు మళ్ళించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాపులంతా పవన్ కు మద్దతుగా నిలవాలని పదే పదే ప్రకటిస్తున్నా ఆయన్ను కూడా ఎవరు పట్టించుకోవటంలేదు.

ఈ నేపధ్యంలోనే చివరకు సొంతకులం కాపులు కూడా తనకు మద్దతుగా నిలవటంలేదనే మంట, బాధ పవన్లో పెరిగిపోతున్నట్లుంది. నిజానికి కాపులు ఏ పార్టీకి నూరుశాతం మద్దతుగా ఎప్పుడు నిలవలేదు.

ఎవరిష్టం వచ్చినా పార్టీల్లో వాళ్ళున్నారు, పోటీచేస్తున్నారంతే. అచ్చంగా కాపులనే నమ్ముకుని పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవికి ఏమైందో ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా పవన్లో జ్ఞానోదయం రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ భాదే ఇపుడు ఈ రూపంలో బయటపడినట్లుంది.