Begin typing your search above and press return to search.

తెలుగుదేశం భవన నిర్మాణానికి రాళ్ళెత్తిన వారెందరో..?

By:  Tupaki Desk   |   29 March 2022 6:30 AM GMT
తెలుగుదేశం భవన నిర్మాణానికి రాళ్ళెత్తిన వారెందరో..?
X
తెలుగుదేశం పార్టీ పుట్టి నలభైఏళ్ళు ఈ రోజుతో పూర్తి అవుతున్నాయి. నలభై అన్నది చాలా ముఖ్యమైన నంబర్. ఈ నంబర్ కి ఎంతో విలువ గౌరవం ఉన్నాయి. ఒక మనిషి అయినా సంస్థ అయినా నలభై పడిలో పడడం అంటే బాధ్యత బాగా తెలిసినట్లు. అన్ని విధాలుగా వివేచన పెరిగినట్లు. సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నట్లు. ఇక ఒక పార్టీగా తెలుగుదేశం పుడుతూనే ఇన్ని లక్షణాలను సంతరించుకుంది.

ఇక తెలుగుదేశం పుట్టుక అన్నది ఒక అద్భుతం. అయితే అది అన్న ఎన్టీయార్ ఆలోచన. అయితే దాని వెనక ఎందరో మహానుభావులు ఉన్నారు. అలాగే నాటి పరిస్థితులు కూడా కొత్త పార్టీ పురుడు పోసుకోవడానికి కారణమయ్యాయి అని చెప్పకతప్పదు. నాడు కాంగ్రెస్ వరసబెట్టి ముఖ్యమంత్రులను మార్చుకుంటూ పోతోంది. 1978 నుంచి 1983 వరకూ చూస్తే ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులను కాంగ్రెస్ వారు మార్చేశారు.

ఇక మధ్యలో ముఖ్యమంత్రి అయిన టీ అంజయ్యను నాడు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో అప్పట్లో హైదరాబాద్ వచ్చిన రాజీవ్ గాంధీ అవమానించారు అన్న వార్త కూడా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచింది. ఇక కాంగ్రెస్ కి ఆల్టర్నేషన్ కోసం అప్పటికే ప్రయత్నాలు జరుగుతున్న వేళ అది.

అలాంటి సమయంలో కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు వంటి వారు టీడీపీ వైపు వచ్చారు. ఎన్టీయార్ తో పాటు తొలి రోజులలో పార్టీ నిర్మాణం బాధ్యతలు తన భుజాన వేసుకున్నది నాదెండ్ల అని కూడా చెప్పుకోవాలి. ఆయన తన రాజకీయ అనుభవాన్ని పూర్తిగా రంగరించి టీడీపీని తీర్చిదిద్దారు.

ఇక ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా టీడీపీకి అన్ని విధాలుగా అండదండగా ఉన్నారు. ఆయనకు రాజకీయాల గురించి తెలియకపోయినా మామ గారు పార్టీ పెట్టారు అని తాను చేయాల్సిన సాయం అంతా చేశారు. టీడీపీ వెనక ఆయన వెన్నెముకగా నిలిచారు. అదే విధంగా నాడు కాంగ్రెస్ సీనియర్ నేతలుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, జానారెడ్డి వంటి వారు కూడా టీడీపీని భుజాన మోశారు.

ఒక విధంగా నాడు కాంగ్రెస్ లో పెల్లుబికిన అసంతృప్తి అంతా టీడీపీ వైపుగా మళ్ళింది. అలా మళ్ళించే పనిలో తమ వంతు రెక్కల కష్టం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారిలో చాలా మంది ఈ రోజు భౌతికంగా లేరు. కానీ టీడీపీ అన్న కొత్త రాజకీయ పార్టీ పుట్టుక వెనక ఉన్నది వారే.

ఇక టీడీపీ పిలుస్తోంది కదలిరా అంటూ ఉమ్మడి ఏపీ వ్యాప్తనా చైతన్య రధం మీద ఎన్టీయార్ తొమ్మిది నెలల పాటు కలియతిరిగితే ఆయన చైతన్య రధానికి రధ సారధిగా అతి ముఖ్య పాత్ర పోషించిన వారు దివంగత నందమూరి హరిక్రిష్ణ. ఇలా ఎంతోమంది మేధావులు, నాయకులూ తెర ముందూ వెనకా తమ పూర్తి సహాయ సహకారాన్ని అందించబట్టే టీడీపీ పుట్టింది. పెరిగింది. అధికారంలోకి వచ్చింది.

ఇక ప్రస్తుతం టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాడు అంటే 1982 మార్చి 29న ఆ పార్టీ పుట్టిన వేళ కాంగ్రెస్ లో ఉన్నారు. 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగానే చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారు.

అయితే టీడీపీకి ఎన్టీయార్ 14 ఏళ్ళ పాటు అధ్యక్షుడిగా వ్యవహిస్తే చంద్రబాబు 26 ఏళ్ల పాటు అంటే రెట్టింపు కాలం ఉన్నారు. ఇక ఎన్టీయార్ టీడీపీని మూడు సార్లు గెలిపించి ఎనిమిదిన్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు 1999, 2014లో టీడీపీని రెండు సార్లు గెలిపించి 14 ఏళ్ల పాటు సీఎం గా ఉన్నారు.

ఎన్టీయార్ హయాంలోనే టీడీపీ జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించింది. చంద్రబాబు ఆ ఒరవడిని కంటిన్యూ చేశారు. ఇక ఉమ్మడి ఏపీలో గొప్పగా వెలిగిన టీడీపీ 40 ఏళ్ళు వచ్చేనాటికి కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కావడం అభిమానులకు కొంత బాధాకరమే. తిరిగి తెలంగాణాలోనూ పుంజుకోవాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు.