Begin typing your search above and press return to search.

వారంతా జగనన్న సైన్యమేనా...?

By:  Tupaki Desk   |   7 April 2022 9:01 AM GMT
వారంతా జగనన్న సైన్యమేనా...?
X
ఏపీలో లెక్క తీస్తే పెద్ద సైన్యమే ఉంది. వారంతా జగన్ మానసపుత్రిక అయిన సచివాలయం నుంచి వచ్చిన వారు. జగనన్న సైన్యంగా గట్టిగా వైసీపీ నేతలు చెప్పుకుంటారు. ఇక తాజాగా జరిగిన నరసారావుపేట సభలో వాలంటీర్లతో సహా అంతా తన సైన్యమని జగన్ గొప్పగా చెప్పుకున్నారు. లక్షలాది మంది ప్రజలకూ ప్రభుత్వానికి వారధిగా ఉంటున్నారని కూడా జగన్ అంటున్నారు.

మూడేళ్ళుగా ప్రజల వద్దకు పాలన సాగుతోంది అంటే అది వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వల్లనే అని జగన్ అభివర్ణించారు. ఒక విధంగా చూస్తే ఏపీలో నాలుగు లక్షల మంది సచివాలయ వ్యవస్థ ద్వారా ఉపాధిని పొందుతున్నారు. ఇందులో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉంటే లక్షా పాతిక వేల పైచిలుకు సచివాలయాలలో పనిచేస్తున్నారు.

వీరంతా జగన్ వల్లనే ఉపాధి పొందారు కాబట్టి వైసీపీకి అండగా ఉంటారని విపక్షాలు కూడా మొదట్లో కలవరపడ్డాయి. కానీ నాటి సీన్ ఇపుడు ఉందా అన్నదే చర్చ. వాలంటీర్లు తాము ఎప్పటికీ కురచ బతుకులతో ఇలా ఉండాల్సిందేనా అని మధనపడుతున్నారు. అయితే అది గౌరవ వేతనం అయిదు వేలు అంటూ ప్రభుత్వం చెబుతోంది. అంటే ఎదుగూ బొదుగూ లేని జీవితం అన్న మాట.

ఇక సచివాలయాలలో పోస్టింగులు అందుకున్న వారు మూడేళ్ళకు చేరువ అవుతున్నా పదిహేను వేల రూపాయల దగ్గరే ఆగిపోయారు. రెండేళ్లకు ప్రోబేషన్ ఇస్తామని చెప్పి వారి చేత టెస్టుల మీద టెస్టులు రాయిస్తూ వేదనకు గురి చేస్తున్నారు. మరో వైపు చూస్తే 2021 అక్టోబర్ 2 నాటికి ప్రోబేషన్ ఇవ్వాల్సి ఉండగా అమలు కాలేదు. ఇపుడు జూన్ అంటున్నారు.

అది చేసినా కూడా ఇప్పటికైతే వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో అయితే పెన్ డౌన్ చేసి కొన్ని రోజులు ఆందోళన బాట పట్టారు. ఇక వాలంటీర్ల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. చాలీచాలని జీతంతో నెట్టుకురాలేక వారు చేతులు చాపుతున్న ఘటనలు కూడా ఉన్నాయంటున్నారు. అలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.

ఇంకో వైపు వీరంతా మొదట్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నా కాలం గడిచే కొద్దీ అసంతృప్తితో ఉన్నారు. మరి వీరికి కుటుంబాలు ఉన్నాయి. ఒకపుడు ఈ నాలుగు లక్షలు ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పదహారు వేల ఓట్లు అని వైసీపీ నేతలు లెక్కలు కట్టుకునే వారు. కానీ ఇపుడు సీన్ మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరిలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

రేపటి ఎన్నికల్లో ఈ సైన్యం అంతా ఎటు వైపు మళ్ళుతారో కూడా తెలియదు అంటున్నారు. ఒక విధంగా చెప్పిన దానికీ చేసిన దానికి పెద్ద గ్యాప్ వచ్చిందని, తమకు గొడ్డు చాకిరే బహుమానంగా మారిందని వాపోతున్నారు. పైగా జీతాలు పెంచలేదు, ప్రోబేషన్ డిక్లేర్ చేయలేదు, ఏ ఒక్క సంక్షేమ పధకం తమకు వర్తించకుండా వైట్ కార్డుని కూడా లాగేశారు అని సచివాలయ ఉద్యోగులు గోల పెడుతున్నారు.

ఈ నేపధ్యంలో వాలంటీర్లకు సత్కారం ఏటికి ఒక మారు చేసి అంతా మా సైన్యం అని అధినాయకత్వం అనుకుంటే సరిపోతుందా అన్నదే ప్రశ్నగా ఉంది. ఇప్పటికైనా సచివాలయ వ్యవస్థ మీద సమీక్ష చేసి ఉద్యోగుల అసంతృప్తి పోగొట్టాల్సి ఉంది. అలాగే అయిదు వేల రూపాయల గౌరవ వేతనం ఎక్కువగా పెంచితేనే వాలంటీర్లు కూడా అదే గొప్ప సన్మానంగా భావిస్తారు. మరి అవేమీ చేయకుండా మా సైన్యం, అంతా మావారే అనుకుంటే తేడా గట్టిగానే కొడుతుంది అంటున్నారు. చూడాలి మరి ఈ సైన్యం దైన్యం వారిని ఏ వైపునకు నడిపిస్తుందో.