Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఆరోపణల్లో ఏమైనా నిజముందా ?

By:  Tupaki Desk   |   12 March 2021 4:30 AM GMT
చంద్రబాబు ఆరోపణల్లో ఏమైనా నిజముందా ?
X
‘బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్షకట్టింది’ ... ఇది తాజాగా చంద్రబాబునాయుడు వినిపించిన అరిగిపోయిన రికార్డు. మచిలీపట్నంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబు రియాక్షన్ ఇది. కొల్లును పోలీసులు అరెస్టు చేయటం ఇదే మొదటిసారి కాదు. చంద్రబాబు రియాక్షనూ మొదటిసారికాదు. తప్పు ఎవరిలో ఉన్నాసరే ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయాలన్నదే చంద్రబాబు టార్గెట్ గా అర్ధమైపోతోంది.

అసలు పోలీసులు కొల్లును ఎందుకు అరెస్టు చేశారు ? మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రంలోకి కొల్లు వెళ్ళటానికి ప్రయత్నించారు. నిజానికి పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్ధి లేదా అభ్యర్ధి తరపున ప్రధాన ఎన్నికల ఏజెంట్ మాత్రమే వెళ్ళాలి. అంతే తప్ప ఎవరుపడితే వారు వెళతామంటే కుదరదు. ఇక్కడ కొల్లు అభ్యర్ధీకాదు కనీసం ప్రధాన ఎన్నికల ఏజెంటు కూడా కాదు. అయినా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళటానికి ప్రయత్నించారు. అందుకనే పోలీసులు అడ్డుకున్నారు.

తనను పోలీసులు ఎప్పుడైతే అడ్డుకున్నారో వెంటనే కొల్లు పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఎలాగైనా సరే పోలింగ్ కేంద్రంలోకి వెళటానికి ప్రయత్నించిన కారణంగానే పోలీసులతో ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలోనే ఎస్ఐను కొల్లు తోసేయటం, తనను చంపేయమంటు కొల్లు ఎస్ఐ మీదకు వెళ్ళటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగిపోయింది. తర్వాత పోలింగ్ కేంద్రం దగ్గరే బైఠాయించారు. దాంతో సదరు కేంద్రం దగ్గర గొడవ జరిగింది.

కొల్లు వ్యవహారశైలి ఎన్నికల కోడ్ నిబందనలకు విరుద్ధంగా ఉంది కాబట్టే పోలీసులు కేసు పెట్టి అరెస్టుచేశారు. వాస్తవం ఇలాగుంటే కొల్లుపై కేసు పెట్టి అరెస్టు చేయగానే బీసీలపై కక్ష కట్టిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. కొల్లుపై చర్యలు తీసుకోవటానికి బీసీలకు ఏమీ సంబంధంలేదు. బీసీలకు చంద్రబాబు ఏమి చేశారు ? ఇపుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తున్నారన్నది బీసీ సమాజం జాగ్రత్తగానే గమనిస్తోంది. కాబట్టి బీసీలపై కక్ష అంటు చంద్రబాబు పదే పదే అరిగిపోయిన రికార్డు వల్ల ఉపయోగం ఉండదు.

ఆమధ్య హత్యకేసులో కొల్లు అరెస్టయినపుడు కూడా బీసీలపై కక్ష అంటు గోలచేశారు. మరో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని అవినీతి కేసులో అరెస్టు చేస్తే అప్పుడూ బీసీలపై వేధింపులంటు గోల చేశారు. అయితే చంద్రబాబు చెప్పిన మాటలను ఎవరు పట్టించుకోవటంలేదు. కాబట్టి ఇఫ్పటికైనా వాస్తవాలు మాట్లాడితే జనాలు హర్షిస్తారు.