Begin typing your search above and press return to search.

'అగ్రిగోల్డ్', హీరా'లకు ఏపీ సర్కార్ బిగ్ షాక్

By:  Tupaki Desk   |   18 Oct 2019 7:22 AM GMT
అగ్రిగోల్డ్, హీరాలకు ఏపీ సర్కార్ బిగ్ షాక్
X
అగ్రిగోల్డ్, హీరా గ్రూపు.. రెండు సంస్థలు ప్రజల సొమ్మును డిపాజిట్ల పేరిట సేకరించి వారికి పంగనామాలు పెట్టినవే.. 8 రాష్ట్రాల్లో మొత్తం 32 లక్షల మంది నుంచి భారీగా దోచుకున్నాయి. ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కినా.. ఆందోళనలు చేసినా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. తమ ఇల్లు వాకిలీ అమ్మి కొందరు, బిడ్డల పెళ్లిళ్లు చదువులు, ఇళ్ల కోసం మరికొందరు పెట్టిన పెట్టుబడి అంతా అగ్రిగోల్డ్ దోచేసుకొని బిచాణా ఎత్తివేస్తే మౌనంగా రోదించారు.

అయితే తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించింది. ఇప్పటికే అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మరికొన్ని ఆస్తుల స్వాధీనానికి రెడీ అయ్యింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా, హీరా గ్రూపు, సోనాల్ భూమి నిర్మాణ అండ్ ఫార్మ్స్ ఇండియా, ఇండిట్రేడ్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటన్నింటిని వేలం వేసి అగ్రిగోల్, హీరా బాధితులకు అందజేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 26.53 కోట్లుగా నిర్ధారించారు. ఈ ఆస్తులు గుంటూరు, నెల్లూరు, విశాఖ, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

ఇక ఫ్యాన్సీ వ్యాపారం పేరిట జనాలకు కుచ్చుటోపి పెట్టిన హీరా గ్రూప్ సీఈవో షేక్ నౌషిరాకు చెందిన 524.49 ఎకరాల భూమిని కూడా ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం, శ్రీకాకుళం జిల్లా టంకాల శ్రీరామ్ 27.08 ఎకరాలతోపాటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఇలా అగ్రిగోల్డ్, హీరా గ్రూపులు జనాల దగ్గర కొట్టేసి కొల్లగొట్టి కూడబెట్టిన ఆస్తులను జప్తు చేసింది ఏపీ సర్కారు. వాటిని కోర్టు అనుమతితో వేలం వేసి వాటి బాధితులకు పంచడానికి మార్గం సుగమం చేస్తోంది.