Begin typing your search above and press return to search.

ఈఎస్ఐ స్కాంలో అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   12 Jun 2020 6:30 AM GMT
ఈఎస్ఐ స్కాంలో అసలేం జరిగింది?
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద కుదుపు చోటుచేసుకుంది. భారీ సంచలనం నమోదైంది. ఈఎస్ఐ స్కాంలో తాజాగా టీడీపీ నేత, మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు నాడు ఆయనకు సహకరించిన ఇద్దరు అధికారులను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అచ్చెన్నను అదుపులోకి తీసుకొని విశాఖకు తరలించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను విశాఖ రేంజ్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ అధికారికంగా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ లో 2014-14 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంభందించి విజిలెన్స్ విచారణలో తేలినట్టు విశాఖ రేంజ్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ కేసు రిజిస్ట్రర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*988.77 కోట్ల కాంట్రాక్టులో 150కోట్ల అవినీతి
విజిలెన్స్ విచారణలో మొత్తం 988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలులో సుమారు రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ అక్రమాల్లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగించారు. మొత్తం ఈ స్కాంలో 19మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. నాన్ రేట్ కాంట్రాక్టు మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్ కొనుగోళ్లు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోళ్లు, ఫర్నిచర్ కొనుగోళ్లు, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లు, కాల్ సెంటర్, ఈసీడీ సర్వీసుల ఒప్పందాల్లో అవినీతి జరిగిందని విశాఖ రేంజ్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. ప్రభుత్వానికి అక్రమంగా నష్టం కలిగించి వారు అక్రమంగా లాభం పొందారని తేల్చారు. మార్కెట్లో ధరలకంటే 50శాతం నుంచి 129శాతం ఎక్కువ ధరలతో మందులు కొనుగోలు చేసినట్టు తేల్చారు.

ఈ కొనుగోళ్లలో ‘ఈ-టెండర్’ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో లోపాయికారి ఒప్పందం కారణంగా కొన్ని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేశారని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

డీఐఎంఎస్ స్టాఫ్ కొంతమంది వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద బినామీ మందుల కంపెనీ పెట్టి అక్రమంగా మందులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని తేల్చారు. కొటేషన్స్, మందుల షాప్స్ నుంచి దొంగ బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. మరికొంతమంది పాత్ర గురించి దర్యాప్తు జరుగుతోంది.

అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టెలిహెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమెటెడ్ అనే సంస్థకు కాల్ సెంటర్, టోల్ ఫ్రీ, ఈసీజీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తేలింది. అప్పటి ఐఎంస్ డైరెక్టర్ డా. సీకే రమేశ్ కుమార్ ఈ ఒప్పందం చేసుకున్నట్టు.. ఈ ఒప్పందం లోపభూయిష్టంగా జరిగిందని తేల్చారు. ప్రతీ ఈసీజీకి రూ.480 రూపాయాలు చెల్లించారు. కానీ అదే ఈసీజీ రూ.200 మాత్రమే. ఒక కాల్ సెంటర్ కు ఫేక్ కాల్స్ లాగ్స్ కి ఒక్కంటికి రూ.180 ప్రతీ నెల బిల్ చెల్లించినట్టు తేల్చారు.

ప్రస్తుతం సేవరేజ్ ప్లాంట్స్, బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్స్ పై అవకతవకలు, అవినీతి మీద విచారణ జరుగుతోంది.