Begin typing your search above and press return to search.

'గ‌డ‌ప గ‌డ‌ప‌కూ'.. స‌మ‌స్య‌ల తోర‌ణం.. వైసీపీకి షాక్‌!

By:  Tupaki Desk   |   11 May 2022 2:30 PM GMT
గ‌డ‌ప గ‌డ‌ప‌కూ.. స‌మ‌స్య‌ల తోర‌ణం.. వైసీపీకి షాక్‌!
X
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వం లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కారు మూడేళ్ల పాలన సందర్భంగా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన అంశాల్లో 95 శాతం అమలు చేసి చూపించిందని, అంతే కాక.. ప్రభుత్వ పథకాలను కులం, ప్రాంతం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయి లో అమలు చేసిందని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

ఈ క్ర‌మం లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్పటి నుంచి పార్టీని ప్రిపేర్ చేసుకునే ప్రారంభించింది. ఈ క్ర‌మం లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను పార దర్శకంగా ఎంపిక చేసి వారికి ఆయా పథకాలను అందించామ‌ని, అలాగే, మునుపెన్నడూ లేని విధంగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలుచేశామ‌ని.. ఇంటింటికీ ప్ర‌చారం చేయ‌నుంది.

ఈ నేపథ్యం లో.. అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలను గడప గడపకు పంపించి ప్రజల నుంచి సలహా లను, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి నియోజకవర్గాల్లోని అన్ని ఇళ్ల సందర్శనను ఎమ్మెల్యేలు పూర్తిచేసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రణాళికా శాఖ అధికారుల‌కు సైతం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా జవాబు దారీ తనంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పథకాలను చేరవేస్తుండడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల మరింత విశ్వాసం పెరిగింద‌ని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల వార్షిక క్యాలెండర్‌ ప్రకారం.. లబ్ధిదారులకు గత మూడేళ్లుగా నేరుగా నగదు బదిలీని అమలు చేయ‌డంతో ఇది కూడా త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని.. అంటోంది.

ఈ నేపథ్యంలో.. పథకాల అమలులో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా 'గడప గడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. స‌ర్కారు.. ఇలా ఆలోచిస్తుంటే.. ప్ర‌జ‌లు మాత్రం మ‌రో విధంగా ఆలోచిస్తున్నారు.

ప్ర‌స్తుతం ప్రారంభ‌మైన గ‌డ‌ప గ‌డ‌ప‌కు.. కార్య‌క్ర‌మంలో మంత్రుల‌కే సెగ త‌గులుతోంది. గడపకూ ప్రభుత్వం పేరిట జనంలోకి వెళుతున్న మంత్రులకు.. సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉగాది నుంచి ఉపాధి హామీ డబ్బులు రావట్లేదని నంద్యాల జిల్లాలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి మహిళలు మొర పెట్టుకున్నారు.

బేతం చర్ల మండలం హెచ్‌.కొట్టాలలో మంత్రి బుగ్గన పర్యటించిన.. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ డబ్బుల పై అధికారిని ప్రశ్నించిన మంత్రి బుగ్గన... వారంలో డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు. ఇక్క‌డొక్క‌టే కాదు.. రాష్ట్రంలో మొత్తం ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. చాలా మంది క‌రెంటు చార్జీల పెంపును, చెత్త‌ప‌న్నును, ప‌న్నుల పెంపు, పెట్రోల్ చార్టీలను ప్ర‌శ్నిస్తున్నారు. సో.. జ‌గ‌న్ అలా ఆలోచిస్తే.. జ‌నాలు మ‌రోలా ఆలోచిస్తున్నారు.మ‌రి ఏం చేస్తారో చూడాలి.