Begin typing your search above and press return to search.

ఏపీ పోలీసుల అత్యుత్సాహం - తెలంగాణ‌లో ప‌రువు హ‌రీ!

By:  Tupaki Desk   |   5 March 2019 8:27 AM GMT
ఏపీ పోలీసుల అత్యుత్సాహం - తెలంగాణ‌లో ప‌రువు హ‌రీ!
X
ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారా? క‌నీసం రాత‌పూర్వ‌క ఫిర్యాదు అంద‌కున్నా కొంద‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే వారు తెలంగాణ‌లో అడుగుపెట్టారా? ఏపీ ప‌రువును గంగ‌లో క‌లిపారా? తీరా విష‌యం ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద‌కు చేర‌డంతో త‌మ‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారోన‌ని హ‌డ‌లెత్తిపోతున్నారా? ఈ ప్ర‌శ్న‌లన్నింటికీ అవున‌నే స‌మాధాన‌మిస్తున్నారు విశ్లేష‌కులు.

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్స్ కేసు ప్ర‌స్తుతం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలంగాణ - ఏపీ పోలీసుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు ఈ వ్య‌వ‌హారం దారితీసింది. అయితే - అస‌లు ఈ కేసులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకున్న తీరు ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. కేవ‌లం ఐటీ గ్రిడ్స్ సంస్థ మేనేజ‌ర్ వాట్సాప్ ఆధారంగా డీఎస్పీ నేతృత్వంలో వంద‌ల మంది ఏపీ పోలీసులు హైద‌రాబాద్ చేరుకోవ‌డం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది.

త‌మ సంస్థ‌లో ప‌నిచేసే భాస్క‌ర్‌, మ‌రో ముగ్గురు ఉద్యోగులు గ‌త నెల 28న పెదకాకాని మండలం ఐజేఎం అపార్టుమెంట్‌ వద్ద నుంచి హైదరాబాద్‌ బయల్దేరుతున్నట్లుగా ఫోన్‌ చేశారని, ఆ తరువాత కనిపించడం లేదంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావుకు వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా ఐటీ గ్రిడ్స్ మేనేజ‌ర్ ఫిర్యాదు చేశార‌ని పోలీసులు చెబుతున్నారు. అందుకే తాము రంగంలోకి దిగిన‌ట్లు వివ‌రిస్తున్నారు. అయితే - ఐటీ గ్రిడ్స్ పై చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకుగాను హైద‌రాబాద్ చేరుకోవాల‌న్న ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే వాట్సాప్ మెజేస్ ఫిర్యాదును పోలీసులు సాకుగా చూపుతున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

ఐటీ గ్రిడ్స్ య‌జ‌మాని అశోక్ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌నయుడు-మంత్రి లోకేష్ కు అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న్ను ర‌క్షించేందుకే రాష్ట్ర పోలీసులు హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్ష‌మయ్యార‌న్న‌ది విశ్లేష‌కుల అనుమానం. హైద‌రాబాద్ లో అడుగుపెట్టాక ఏపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యంపై ఫిర్యాదు చేసిన లోకేష్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి ఆయ‌న్ను కిడ్నాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించార‌న్న ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్ర‌దర్శిస్తున్నార‌ని.. వారికి అస‌లు ఈ కేసుతో సంబంధ‌మేంట‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ కూడా నిల‌దీశారు. మ‌రోవైపు - ఐటీ గ్రిడ్స్ పై కేసు విచాణ‌లో తాము జోక్యం చేసుకోలేమంటూ ఏపీ పోలీసులకు తేల్చిచెప్పింది. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి పొరుగు రాష్ట్రంలో ప‌రువు పోగొట్టుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ కేసుపై ప్ర‌స్తుతం ఎన్నిక‌ల సంఘం కూడా దృష్టి సారించింది. దీంతో ప్ర‌భుత్వానికి కొమ్ము కాసేందుకు ప్ర‌య‌త్నించిన కొంద‌రు పోలీసుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది.