Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ వీరుడు.. కాల్ షీట్లు లేకపోతే రాజకీయాలు చేసే సన్నాసి!

By:  Tupaki Desk   |   1 Oct 2021 3:30 PM GMT
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ వీరుడు.. కాల్ షీట్లు లేకపోతే రాజకీయాలు చేసే సన్నాసి!
X
ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రుల దాడి కొనసాగుతోంది. తాజాగా వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన పవన్ పై ఏపీ మంత్రి శంకర్ నారాయణ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ లాంటి సన్నాసి ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాడో ఆయనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా అధికారంలోకి రావాలని అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ కు ఆ ఆలోచనల లేదని మంత్రి శంకర్ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శ్రీశైలంలోని భమ్రరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్న మంత్రి శంకర్ నారాయణ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పవన్ కళ్యాణ్ ప్యాకేజీ వీరుడని’ విమర్శించారు. ఒకసారి తెలుగు దేశం పార్టీతో మరోసారి బీజేపీతో.. ఇంకోసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ కు సినిమా కాల్షీట్లు లేకపోతే రాజకీయాలు గుర్తు వస్తాయని మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. సినిమాలు లేని సమయంలో అప్పుడప్పుడు వచ్చి ఏపీలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో రోడ్లపై రాజకీయాలు మొదలుపెట్టారు మంత్రి శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులు పక్కదారి పట్టించడంతోనే రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలోని లోటుపాట్లపై పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని.. ఎక్కడ నిద్రపోయారని మంత్రి శంకర్ నారాయణ నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలు సంతోషంగా ఉంటే జనసేన పార్టీకి నిద్ర రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎదుటివారిపై బురద జల్లడం వెన్నెతో పెట్టిన విద్య అంటూ మంత్రి శంకర్ నారాయణ విరుచుకుపడ్డారు.

ఇక సోమువీర్రాజు సైతం అవగాహన లేక కేంద్ర నిధులు పక్కదారి పట్టాయని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మే లోపు రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసేలా టెండర్లు పిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు చాలా దారుణంగా ఉందని మంత్రి శంకర్ నారాయణ విరుచుకుపడ్డారు. అంతేకాదు.. జేసీ బ్రదర్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివాకర్ రెడ్డి బ్రదర్స్ ను ప్రజలు ఎప్పుడో పక్కన పెట్టేశారని వారు మదమెక్కి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జేసీ బ్రదర్స్ వ్యవహారశైలితో చంద్రబాబు తలపట్టుకుంటున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని దీన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.