Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి గారి వియ్యంకుడు గుడికి వెళితే మర్యాదలు అలా ఉండాలట

By:  Tupaki Desk   |   22 Dec 2021 3:29 AM GMT
ఏపీ మంత్రి గారి వియ్యంకుడు గుడికి వెళితే మర్యాదలు అలా ఉండాలట
X
ఒకటి తర్వాత ఒకటిగా ఏపీ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగానూ.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారాయి. మొన్నటికి మొన్న ఒంగోలులో మంత్రి బాలినేని పై విమర్శలు చేశారంటూ ఆయన అనుచరుడు సుభాని.. పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను అనరాని మాటలు అనటమే కాదు.. ఒక రేంజ్లో దాడి చేసిన వైనం పెను సంచలనంగా మారింది. బాలినేని ముందు చూపుతో.. ఈ ఇష్యూను రెండు రోజులకే సెటిల్ చేసేలా ఆయన పావులు కదిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో వివాదం తెర మీదకు వచ్చింది.

ఏపీ మంత్రి గారి వియ్యంకుల వారి వ్యవహారం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మంత్రిగారి వియ్యంకుడినని చెబుతూ ఒక పెద్ద మనిషి పదిహేడు మందిని వెంట పెట్టుకొని సింహాచలం కొండకు వెళ్లారు. అక్కడి ఆలయ సిబ్బంది కి సమాచారం ముందుగా ఇచ్చారు. దీంతో వారికి పీఆర్వో నాయుడు వెల్ కం చెప్పారు. వారిని ఏఈవో రాఘవకుమార్ వద్దకు తీసుకెళ్లి.. మంత్రి గారి వియ్యంకుల వారంటూ పరిచయం చేశారు. దీంతో కుశల ప్రశ్నలు వేసిన ఆయన.. దగ్గరుండి మర్యాదలకు లోటు లేకుండా చూసుకోవాలని పేర్కొంటూ వారిని పంపారు.

అధికారి ఆదేశాలకు తగ్గట్లే.. వారికి చక్కటి దర్శనంతో పాటు.. తీర్థ ప్రసాదాల్ని ఇచ్చి సాగనంపారు. ఇదంతా చదివిన వారికి అంతా ఓకే కదా? ఇంకేం సమస్య ఉంటుందని అనుకోవచ్చు. కానీ.. ఇక్కడే ట్విస్టు మొదలైంది. సింహాచలం స్వామి వారి దర్శనానికి వెళ్లిన తమకు.. ఆలయ అధికారి వెంట రాకుండా.. పీఆర్వోను పంపారని వియ్యంకుల వారు ఫీలయ్యారు. వెళ్లి మంత్రి గారికి కంప్లైంట్ చేశారు. అంతే.. ఏఈవోకు.. పీఆర్వోకు అమరావతి నుంచి పిలుపు వచ్చింది. అక్కడకు వెళ్లిన ఇద్దరు అధికారులకు.. సదరు మంత్రిగారు క్లాస్ పీకటమే కాదు.. మా బంధువులు వస్తే దగ్గరుండి దర్శనం చేయటానికి టైం లేదా? అంటూ ఫైర్ అయ్యారు.

అక్కడి తో ఆగకుండా వారిని ఆలయ విధుల నుంచి తప్పించటంతో పాటు వేర్వేరు స్థానాలకు వారి పై బదిలీ వేటు వేశారు. ఈ ఉదంతం దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో కొత్త చర్చను రేపింది. మర్యాదలు చేసినా సరిపోకపోవటం కాదు.. తాము అనుకున్నట్లుగా మర్యాదలు జరగక పోవటమా? అంటూ ఫైర్ అయి.. చర్యలు వేయటమా? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.