Begin typing your search above and press return to search.

45వేల ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ .. సీఎం సంచలన నిర్ణయం !

By:  Tupaki Desk   |   15 Sept 2020 5:40 PM IST
45వేల ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ .. సీఎం సంచలన నిర్ణయం !
X
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం .. అన్నింటికి మించి పిల్లల చదువు పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాల్లో కూడా విద్యార్ధులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. అమ్మఒడి , విద్యా దీవెన , వసతి దీవెన .. వంటి పలు పథకాల్ని అమల్లోకి తీసుకువచ్చారు. అలాగే నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా అన్నింటికి మూలం చదువే అని జగన్ ప్రభుత్వం నమ్మి విద్యార్థులకి అన్ని విధాలా సహాయం చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదికి 45వేల ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో పలు సంస్కరణల కోసం సీఎం అధికారులకు డెడ్‌ లైన్ విధించారని, అందుకోసం అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

డిజిటలైజేషన్ ‌లో ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడబోతున్నాయని మంత్రి తెలిపారు. మొదటి దశలో భాగంగా 10వేల స్టార్ట్‌ టీవీలను స్కూళ్లలో అమర్చనున్నట్లు ఆయన తెలిపారు. దీనికోసం రూ.45 నుంచి రూ.50కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా ఇటీవల క్యాంపు ఆఫీసులో రివ్యూ మీటింగ్ ‌లో మాట్లాడిన జగన్‌.. డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలు, తల్లిదండ్రులు చూసేలా మార్పులు చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.