Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ స‌ర్కారుకు హైకోర్టు తాజా ఆదేశం

By:  Tupaki Desk   |   25 April 2019 7:01 AM GMT
ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ స‌ర్కారుకు హైకోర్టు తాజా ఆదేశం
X
ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల ఫోన్ల‌ను అధికారులు ట్యాపింగ్ చేశారంటూ దాఖ‌లైన కేసుపై హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ కేసులో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాలంటూ ఏపీ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు కోరింది. జ‌స్టిస్ ఏవీ శేష‌సాయి.. జ‌స్టిస్ యు. దుర్గాప్ర‌సాద‌రావుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తాజా ఆదేశాల్ని జారీ చేసింది.

టెలిగ్రాఫ్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 5(2)ను అనుస‌రించాలా? లేదా అంశాల‌పై రాత‌పూర్వ‌కంగా స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరింది. ఈ కేసు విచార‌ణ‌ను జూన్ 6కు వాయిదా వేసింది. త‌న‌తో పాటు త‌మ పార్టీకి చెందిన నేత‌ల ఫోన్ల‌ను ఏపీ అధికారులు అన్యాయంగా ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీన్ని విచార‌ణ‌కు చేప‌ట్టిన న్యాయ‌స్థానం.. తాజాగా ఏపీ ప్ర‌భుత్వాన్ని అఫిడ‌విట్ ను కోర్టుకు ఇవ్వాల‌ని కోరింది. ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో టెలిగ్రాఫ్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 5(2) ను అనుస‌రించిన‌ట్లుగా పేర్కొన్న అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్ త‌న వాద‌న‌లు వినిపిస్తూ రూల్స్ ను ఫాలో అయ్యామ‌ని పేర్కొన్నారు.

ఏజీనే స్వ‌యంగా ఫోన్ల‌ను రూల్స్ ప్ర‌కారం ట్యాప్ చేసిన విష‌యాన్ని ఒప్పుకుంటున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు దాఖ‌లు చేయ‌నున్న అఫిడ‌విట్ లో ఏయే అంశాలు ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.