Begin typing your search above and press return to search.

షర్మిల-జగన్ విభేదాలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   11 July 2021 2:30 AM GMT
షర్మిల-జగన్ విభేదాలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
X
తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలను అన్నయ్య, ఏపీ సీఎం జగన్ దూరం పెట్టారని ఇటీవలే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా బయటపడింది. ఇడుపుల పాయలో వైఎస్ఆర్ సమాధిని ముందు ఉదయం చెల్లెలు షర్మిల సందర్శిస్తే.. సాయంత్రం సీఎం జగన్ వచ్చి నివాళులర్పించారు. అప్పుడే వీరిద్దరికీ పడడం లేదని మీడియాలో గుసగుసలు వినిపించాయి.

ఏపీ సీఎం జగన్, సోదరి షర్మిల మధ్య విభేదాలపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని శనివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం తాజాగా రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.

అన్నాచెల్లెలు మధ్య విభేదాలున్నాయని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అన్నాచెల్లెలి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అంతేకాదు వాళ్లిద్దరి మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవని నారాయణ స్వామి తెలిపారు.

ఏపీ సీఎం జగన్ దృష్టిలో ఆంధ్రా, తెలంగాణ వేర్వేరు కాదని.. కేసీఆర్ అంటే జగన్ కు అభిమానం ఉందని నారాయణ స్వామి హాట్ కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి కేసీఆర్, జగన్ పైకి మాత్రమే తిట్టుకుంటున్నారా? అన్న అనుమానం ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను బట్టి కలుగుతోంది.

ఓ వైపు తెలంగాణ మంత్రులు ఏపీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా కేటీఆర్ సైతం 'ఏపీతోనే కాదు.. ఆదేవుడితోనైనా కృష్ణా జలాల కోసం ఫైట్' చేస్తామని అన్నారు.కానీ ఏపీ డిప్యూటీ సీఎం మాత్రం కేసీఆర్ ను పొగడడం చర్చనీయాంశమైంది.

ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో కేసీఆర్, జగన్ డ్రామాలాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి బలం కలిగేలా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.