Begin typing your search above and press return to search.

'దిశ' చట్టం పై కమిట్ మెంట్ ఎంతో చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   3 Jan 2020 5:43 AM GMT
దిశ చట్టం పై కమిట్ మెంట్ ఎంతో చెప్పిన జగన్
X
మైలేజీ కోసం హడావుడి గా బిల్లులు ప్రవేశ పెట్టటం..తూతూ మంత్రంగా చట్టాలు చేయటం.. తర్వాత మర్చిపోవటం లాంటివి కొన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి. అందుకు భిన్నంగా చేసే పనిని పక్కాగా.. ప్రణాళిక బద్దంగా చేయటం మరికొందరు చేస్తుంటారు. ఆ కోవకే వస్తుంది ఏపీలోని జగన్ ప్రభుత్వం. తాను తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ముందస్తుగా పక్కా కసరత్తు చేసిన తర్వాతే రంగంలోకి దిగటం ఏపీ ప్రభుత్వం లో కనిపిస్తుంది.

దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన దిశ హత్యోదంతం నేపథ్యం లో అత్యాచారాలు.. దారుణ నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలయ్యేందుకు వీలుగా దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది. కేంద్రానికి పంపింది. చేశామంటే చేశామన్నట్లు కాకుండా.. చట్టాన్ని చేసిన తర్వాత తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఏపీలో మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ఏపీ దిశ చట్టం 2019 అమలు చేయటం కోసం ఇద్దరు ప్రత్యేక అధికారుల్ని ప్రభుత్వం నియమించింది. ఐఏఎస్ విభాగంలో ప్రస్తుతం మహిళా.. శిశు సంక్షేమ శాఖ డైరక్టర్లుగా ఉన్న కృతికా శుక్లాను దిశ స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. అదే సమయంలో ఐపీఎస్ అధికారిణిని నియమించారు. కర్నూలు ఏఎస్పీగా పని చేస్తున్న దీపికను గుంటూరు సీఐడీవిభాగంలో ఏడీజీగా బదిలీ చేశారు.

ఆమెను కూడా దిశ స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం తో తాము తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ మీద జగన్ ప్రభుత్వం ఎంత శ్రద్ద ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. తాజాగా ఈ ఇద్దరు మహిళా అధికారుల నియామకాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు.