Begin typing your search above and press return to search.

దావోస్ డ్యామేజ్ ను ఎలా కంట్రోల్ చేయాలి.. జగన్ సర్కారుకు మరో టాస్కు!

By:  Tupaki Desk   |   27 May 2022 9:30 AM GMT
దావోస్ డ్యామేజ్ ను ఎలా కంట్రోల్ చేయాలి.. జగన్ సర్కారుకు మరో టాస్కు!
X
అందుకే అంటారు వేలెత్తి చూపించే ముందు జాగ్రత్తగా ఉండాలని. ఒక వేలు ఎదుటోడికి చూపిస్తే.. నాలుగేళ్లు మనవైపు చూపిస్తాయని ఉత్తినే అనలేదు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. మూడేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల తర్వాత దావోస్ కు వెళ్లిన వైనం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు.

ఎందుకంటే.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ కు వెళితే.. అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటమే. పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ.. ఏపీకి మరిన్ని సంస్థల్ని తెచ్చే ప్రయత్నంలో జగన్ టీం ఫెయిల్ అయ్యిందన్న మాట బలంగా వినిపిస్తోంది. పక్కనే ఉన్న సోదర తెలంగాణ రాష్ట్రం ప్రతి రోజు పెట్టుబడులకు సంబంధించిన మేజర్ అనౌన్స్ మెంట్ తో పాటు.. ఐదారు కంపెనీలు రాష్ట్రానికి రానున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నాయి.

అందుకు భిన్నంగా ఏపీ పరిస్థితి ఉందంటున్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున దావోస్ కు మంత్రి కేటీఆర్ అండ్ టీం వెళ్లగా.. ఏపీ విషయానికి వస్తే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దావోస్ కు వెళ్లటం తెలిసిందే. గురువారం ఒక్కరోజునే తీసుకుంటే తెలంగాణకు హ్యుందాయ్ వచ్చేందుకు ఆసక్తి చూపిందని.. రూ.1400 కోట్లతో భారీ పరిశ్రమను స్థాపించేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రకటన చేశారు. దీంతో పాటు మాస్టర్ కార్డ్ తో డిజిటల్ సేవలకు ఒప్పందం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే కాకుండా మరిన్ని ఒప్పందాలు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏపీ విషయానికి వస్తే.. ఎలాంటి ప్రకటన లేకపోవటం గమనార్హం.

దావోస్ లో భారీ పెట్టుబడులు సాధించేందుకు వెళ్లిన జగన్ టీంకు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దావోస్ ప్రయాణమే ఒక వివాదంతో షురూ కావటాన్ని ప్రస్తావిస్తున్నారు. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనల సందర్భంగా ప్రత్యేక విమానాన్ని వినియోగించే నాటి సీఎం చంద్రబాబును విమర్శించిన జగన్.. కేవలం తాను.. తన సతీమణి వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్నిఏర్పాటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. అధికారిక షెడ్యూల్ ప్రకారం నేరుగా దావోస్ కాకుండా లండన్ కు విమానం వెళ్లి ల్యాండ్ కావటంపై రచ్చ నడిచింది.

కుటుంబం కోసం లండన్ వెళ్లటం తప్పేం కాదు. కానీ.. ఆ విషయాన్ని ముందుగా చెప్పేస్తే వేలెత్తి చూపించేవారికి అవకాశం ఉండేది కాదు. ఇక.. దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ వెలవెలబోతుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్ కళకళలాడుతూ.. రోజు నాలుగైదు ప్రకటనలు చేయటం తెలిసిందే.

ఇదంతా చూస్తున్న జగన్ టీం.. దావోస్ కు సీఎం జగన్ రావటం ద్వారా తప్పు చేసినట్లుగా భావిస్తున్నారు. దావోస్ కు వెళ్లి సాధించిందేమిటంటే.. భారత్ కు చెందిన కంపెనీలతో కొన్ని ఒప్పందాలు. దానికి దావోస్ కు వెళ్లాల్సిన అవసరం ఏముంది? దేశంలోనే కూర్చొని ఒప్పందాలు చేసుకోవచ్చు కదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదో చేద్దామని వెళ్లిన దావోస్ ట్రిప్ తో మైలేజీ రాక డ్యామేజీ మిగిలిందన్న ఆవేదన వినిపిస్తోంది. ఎప్పటి మాదిరి దావోస్ కు సీఎం జగన్ వెళ్లకుండా ఉండే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.