Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పుకున్నారు.. జగన్ ఒప్పుకున్నారు..!

By:  Tupaki Desk   |   28 Jun 2019 1:14 PM GMT
కేసీఆర్ చెప్పుకున్నారు.. జగన్ ఒప్పుకున్నారు..!
X
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. యంగ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తుండడం.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటుండడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారిస్తూనే రాష్ట్రం కోసం ఇటు తెలంగాణతో.. అటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు. ఎన్నికల ముందు నుంచీ వీరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ, ఇప్పుడు దృఢంగా అవుతోంది.

ఇద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే ఇరు రాష్ట్రాల్లో స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉప్పు- నిప్పులా ఉన్న రెండు రాష్ట్రాలు ఇప్పుడు మాత్రం పరస్పర సహకారం అందించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి కారణం ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి చూపిస్తున్న చొరవ అనండంలో ఎటువంటి సందేహం లేదు.

తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంతో ఇది రుజువైంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను స్నేహపూర్వక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలి అడుగు వేశారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల్లో అతి ముఖ్యమైన నీటి పంపకం గురించి చర్చించుకునేందుకు అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ చెప్పిన అంశాలకు జగన్ కూడా మద్దతు తెలిపారు. దీంతో జల వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసిన తొలి ప్రయత్నమే సక్సెస్ అయింది.

ముందుగా, ఈ సమావేశంలో భాగంగా నదుల్లో నీటి లభ్యతపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై మహారాష్ట్ర, కర్ణాటక లెక్కలేనన్ని బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీటి రాని పరిస్థితి వచ్చిందన్నారు. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి దీనిని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏ పాయింట్ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో కేసీఆర్ వివరించారు. గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4 వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు. ఈ నీటిని ఉపయోగించుకునే అవకాశాలనూ ప్రజెంటేషన్‌లో ఆయన వెల్లడించారు.

కేవలం తెలంగాణలో ఉన్న నదులకు సంబంధించిన వివారాలు మాత్రమే కాకుండా ఏపీలోని నీటి వాడకంపైనా కేసీఆర్ ప్రజెంటేషన్ ఇవ్వడం విశేషం. గోదావరి నుంచి శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలని, తద్వారా కరువుతో అల్లాడిపోతున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి గోస తీరుతుందని కేసీఆర్ అన్నారు. అలాగే పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖ వరకు నీళ్లు తీసుకుపోవడం.. వంశధార, నాగావళి నదుల నీళ్లను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల బాధ తీరుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల బాగు కోసం ఎంత దూరమైన వెళ్తామని చెప్పుకొచ్చారు. తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నమన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోందని, రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చని, అందుకే కేసీఆర్ చెప్పిన ఫార్ములాను ఫాలో అవుతామన్నారు. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని జగన్ ఇరు రాష్ట్రాల అధికారులకు సూచించారు.