Begin typing your search above and press return to search.

ఏపీ సెక్రటేరియట్‌లో కరోనా..కేబినెట్ భేటిపై అనుమానం

By:  Tupaki Desk   |   8 Jun 2020 2:31 PM GMT
ఏపీ సెక్రటేరియట్‌లో కరోనా..కేబినెట్ భేటిపై అనుమానం
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం ఈ గురువారం జూన్ 11 న జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి ముందు, ఏపీ సెక్రటేరియట్ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న దాదాపు 10 మందికి తాజాగా కరోనా వైరస్ పాజిటివ్‌ గా తేలడంతో ఈ మీటింగ్ నిర్వహిస్తే ప్రమాదమని మంత్రులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.

సీఎం జగన్ ఛాంబర్ ఆఫ్ సెక్రటేరియట్ మొదటి బ్లాక్‌లో పనిచేస్తున్న ఒక జీఏడీ ఉద్యోగితోపాటు ఒక ఆర్టీజీఎస్ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్ వర్గాలకు కేబినెట్ సమావేశంపై సందేహాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మలకొండయ్య వ్యవసాయ, పరిశ్రమల విభాగాల సిబ్బందిని ఇంటి నుండే పని చేయడానికి అనుమతి ఇచ్చారు. మిగతా విభాగాలకు చెందిన వారంతా తాజాగా చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీని కలిసి ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతి ఇవ్వాలని సంప్రదించారు. దీనిపై ప్రధాన కార్యదర్శి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

సచివాలయంలో క్యాబినెట్ సమావేశం సాధ్యం కాకపోతే, అధికారులు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించాలని పరిశీలిస్తున్నారు. క్యాంప్‌ కార్యాలయానికి క్యాబినెట్‌ సమావేశానికి వసతి కల్పించగలదా లేదా అనేది అనుమానంగా మారింది.. సీఎం క్యాంప్ కార్యాలయంలో కేబినెట్ భేటికి అధికారులు నిర్ణయిస్తే, వారు కేబినెట్ సమావేశానికి ముందు వేదికను కరోనా నివారణకు శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.. దీనికి సంబంధించిన నిర్ణయం రేపు లేదా మరుసటి రోజు తీసుకుంటారని తెలుస్తోంది.

కేబినెట్ ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే, ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని యోచిస్తోంది. సిఎం జగన్ తన క్యాబినెట్ సహచరుల అభిప్రాయాన్ని ఈ సమావేశంలో తీసుకోవాలని అనుకుంటున్నారు.