Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ‌కు ఇంటిపోరు మొద‌లైంది

By:  Tupaki Desk   |   18 Jan 2017 10:11 PM IST
ముద్ర‌గ‌డ‌కు ఇంటిపోరు మొద‌లైంది
X
కాపు - బలిజల నాయకుడిగా ముందుకు సాగుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు బ‌లిజ‌ల నుంచి కొద్దికాలం స‌హ‌కార లోపం ఎదుర‌వుతుంటే తాజాగా అందులో విమ‌ర్శ‌ల‌ ప‌ర్వం మొద‌లైంది. ముద్ర‌గ‌డ ఈ నెల నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు బలిజల మద్దతు ఉండదని బలిజనాడు ఏపీ కన్వీనర్ శివశంకర్ ప్ర‌క‌టించారు. కాపులతో సంబంధం లేకుండా త్వరలో బలిజ శంఖారావం చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ముద్రగడ ప‌ద్మనాభం సమావేశాలకు బలిజలు హాజరుకావద్ద‌ని సూచించారు. ప‌లు ఉద్య‌మాలు నిర్వ‌హించిన మందకృష్ణ మాదిగ‌ - పీవీ రావులను చూసి ముద్రగడ నేర్చుకోవాలని సూచించారు.

బలిజల కోసం పోరాటం చేస్తున్న ఓవి రమణపై ముద్ర‌గ‌డ చేసిన విమర్శలను ఖండిస్తున్నామ‌ని శివ‌శంక‌ర్ తెలిపారు. రిజర్వేషన్ల హక్కులు సాధించేందుకు ఉన్న నిష్పాక్షిక ఉద్యమ మార్గం విడిచి - కేవలం ఒక రాజకీయ పార్టీకి - ఒక వ్యక్తికి వ్యతిరేకంగా - వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ లక్ష్య సాధన కోసం పనిగట్టుకొని ముద్రగడ చేస్తున్న రాజకీయ కుల ఉద్యమాలకు బలిజలను ఉపయోగించుకోవద్దని మండిప‌డ్డారు. ముద్రగడ - ఆయన మద్దతుదారులు వివిధ ప్రాంతాల్లో కాపుల సమావేశాలకు బలిజలు హాజరుకావద్దని కోరారు. అంతేకాకుండా మీడియా కూడా కాపు, బలిజలను వేరువేరుగా పరిగణించాలని కోరారు. సంఖ్యాపరంగా కాపుల కంటే ఎక్కువగా ఉన్న బలిజల ప్రయోజనాల గురించి ముద్రగడ ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవని మండిప‌డ్డారు. కాపు - బలిజలు ఏనాడూ ఒక్కటిగా ఉన్నట్లు చరిత్రలో లేదని కేవలం ముద్రగడ ఉనికి - ప్రచారం కోసమే బలిజలను వాడుకుంటున్నారని విమ‌ర్శించారు. ముద్రగడ ఇప్పటి వరకూ తీసుకున్న ఏ నిర్ణయమైనా కాపు - బలిజ నేతలతో కలిసి చర్చించి తీసుకున్నవి కాదని విమ‌ర్శించారు. తునిలో నిర్వహించిన సభలో తీసుకున్న నిర్ణయాన్ని కనీసం కాపు నేతలతో చర్చించి ప్రకటించారా? అని ప్రశ్నించారు.

సామాజిక ఉద్యమాలు నడుపుతున్న మంద కృష్ణ మాదిగ గానీ - ఆర్. కృష్ణయ్య గానీ - అంతకు ముందు మాల మహానాడు నేత దివంగత పీవీ రావుగానీ వారి లక్ష్య సాధనకు తీవ్రమైన ఉద్యమాలు తప్ప - ఏనాడూ నాటి ముఖ్యమంత్రులనుగానీ, నాటి అధికార పార్టీలను గానీ వ్యక్తిగత లక్ష్యం చేసుకుని ఆరోపణలు చేయని విషయాన్ని ముగ్రడ గుర్తుంచుకోవాలని తెలిపారు. కానీ ముద్రగడ మాత్రం కేవలం ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీని, ముఖ్యమంత్రిని లక్ష్యంగా ఎందుకు చేసుకుంటున్నారో, దాని వెనుక ఆయన ఎవరికి బానిసగా పనిచేస్తున్నారో బలిజలతోపాటు కాపులు కూడా గ్రహించాలని కోరారు. ఏదో ఒక పార్టీలో, ప్రభుత్వాన్నో గద్దె దింపేందుకు చేసే ప్రయత్నాలను బలిజలు ఎప్పుడూ సమర్థించరని తెలిపారు. త్వరలో బలిజల సమస్యలపై కాపులతో సంబంధం లేకుండా బలిజ శంఖారావం నిర్వహించబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/