Begin typing your search above and press return to search.

గూగుల్ రూల్స్ బ్రేక్ చేసిన ఉద్యోగి .. రూ.1300 కోట్ల ఫైన్ !

By:  Tupaki Desk   |   7 March 2020 10:30 AM GMT
గూగుల్ రూల్స్ బ్రేక్ చేసిన ఉద్యోగి .. రూ.1300 కోట్ల ఫైన్ !
X
గూగుల్ కంపెనీ నిబంధనలు అతిక్రమించి, గూగుల్ రూల్స్ కి వ్యతిరేకంగా మరో కంపెనీలోకి వెళ్లిపోయిన ఓ ఇంజనీర్ కు గూగుల్ సంస్థ ఏకంగా రూ.1300 కోట్ల జరిమానా విధించింది. అసలు ఈ రోజుల్లో ఉద్యోగం మారడం అంటే ..ఎక్కున బస్సు దిగి , మరో బస్సు ఎక్కినట్టే. ఇష్టం వచ్చినన్ని రోజులు ఒక కంపెనీ లో పనిచేయడం , అక్కడ నచ్చకపోతే మరో కంపెనీల్లోకి దూకేయడం ప్రస్తుతం సాధారణమైన విషయమే. అంతమాత్రానే ఏకంగా 1300 కోట్ల జరిమానా విధిస్తారా ..ఉద్యోగం మారడం నేరమా? అని అనుకోవచ్చు. కానీ , ఇది ముమ్మాటికీ తప్పే అని గూగుల్ కంపెనీ అంటోంది. అంతేకాదు.. ఉద్యోగం మారిన ఉద్యోగిపై కోర్టుని ఆశ్రయించింది. కోర్టు అతగాడికి రూ.1300 కోట్లు ఫైన్ వేసింది. ఆ మొత్తాన్ని గూగుల్ కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ..ఇది నిజంగా నిజం.

ఈ విషయం తెలుసుకున్న ఆ ఇంజనీర్ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగికి అంతకంటే మంచి ఆఫర్ వస్తే ఠక్కుమని ఎగిరి వెళ్లిపోతారు. ఆలా వెళ్లే క్రమం లో అంతకు ముందు పనిచేసే కంపెనీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను తప్పకుండా పాటించాలి. లేకపోతే, తగిన ఫలితం అనుభవించాల్సిందే ఆయనలాగే.

పూర్తి వివరాలని చూస్తే .. ఆంటోనీ లావన్డోస్కీ అనే వ్యక్తి గూగుల్‌ లో ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతను గూగుల్ లో పనిచేస్తున్న సమయంలోనే ఉబర్‌ నుంచి మరో మంచి ఆఫర్ రావడంతో గూగుల్ కి గుడ్ బై చెప్పేసాడు. అయితే, ఇదే సమయంలో గూగుల్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మర్చిపోయాడు. గూగుల్ లో పనిచేస్తున్న సమయంలో అయన పనికి మెచ్చి , కంపెనీ ఒకసారి ఏకంగా 120 మిలియన్ డాలర్స్ బోనస్ గా ఇచ్చింది. గూగుల్ ఎన్ని చేసినా కూడా మంచి ఆఫర్ రాగానే ..నిబంధనలు కూడా పాటించకుండా మానేయడంతో .. తమ కంపెనీ రహస్యాల్ని దొంగిలించి వెళ్లిపోయాడని ఆంటోనీ పై కోర్టులో కేసు వేసింది.

ఈ కేసు విషయంలో అతడికి ఉబర్‌ కంపెనీ న్యాయపరమైన రక్షణ కల్పిస్తూ వచ్చింది. కొంత కాలానికి అతడు ఉబర్‌ కి కూడా గుడ్ బై చెప్పి , రైడ్‌ షేర్‌ అనే మరో కంపెనీ లోకి మారిపోయాడు. దీనితో ఉబర్‌.. అప్పటి వరకూ తను కల్పిస్తున్న న్యాయ రక్షణను ఉపసంహరించుకుంది. కేసును విచారించిన కోర్టు.. ఇంజినీర్ ఆంటోనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రూ. 1300 కోట్లు గూగుల్‌కు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆంటోనీ పరిస్థితి దయనీయంగా మారింది. దురాశ దుఖానికి చేటు అన్న మాట ...ఈయన్ని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.