Begin typing your search above and press return to search.

వివాదంలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యే ?

By:  Tupaki Desk   |   8 Jun 2022 6:30 AM GMT
వివాదంలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యే ?
X
మైనింగ్ కు సంబంధించి మ‌రో వివాదం ఒక‌టి వెలుగు చూసింది. ఆంధ్రాలో అక్ర‌మ మైనింగ్ పై బీజేపీ జాతీయాధ్య‌క్షులు జేపీ న‌డ్డా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న త‌రుణానే చిత్తూరులో ఓ ఘ‌ట‌న వెలుగు చూసింది. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో ఈ ప్రాంతంలో అక్ర‌మ మైనింగ్ కు సంబంధించి విమ‌ర్శ‌లున్నాయి. వీటిని అడ్డుక‌ట్ట వేసేందుకు కూడా స‌ర్కారు తీసుకుంటున్న చ‌ర్య‌లేవీ లేవ‌ని కూడా టీడీపీ ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

ఈ త‌రుణాన చిత్తూరు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు సోద‌రుడి కుమారుడిపై వ‌స్తున్న అభియోగాలు అధికార పార్టీకి త‌లవంపులు తేనున్నాయి. వాస్త‌వానికి త‌మ ప్ర‌భుత్వం క్షేత్ర స్థాయి అవినీతికి తావేలేదని పదే ప‌దే చెప్పే జ‌గ‌న్ ఇప్పుడేమంటారో బ‌దులివ్వా ల‌ని విప‌క్షం ప‌ట్టుబ‌డుతోంది. త్వ‌ర‌లోనే శాస‌న స‌భ‌కు సంబంధించి వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఈ విష‌యాల‌న్నింటినీ వెలుగులోకి తెచ్చేందుకు తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని కూడా చెబుతోంది.

చిత్తూరు రూర‌ల్ మండ‌లం బండ‌ప‌ల్లె లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మైనింగ్ జ‌రుగుతుంద‌న్న ఆరోప‌ణ‌లు ఇప్పుడిక చ‌ర్చ‌కు తావివ్వ‌నున్నాయి. ఆర్డీఓ మాత్రం తామేమీ అనుమ‌తులు ఇవ్వ‌లేద‌నే అంటున్నారు. గ్రావెల్ క్వారీల‌కు సంబంధించి తామేం అనుమ‌తులూ ఇవ్వ‌లేద‌ని, సంబంధిత ద‌ర‌ఖాస్తులు ఉన్న‌తాధికారుల ద‌గ్గ‌ర పెండింగ్-లోనే ఉన్నాయ‌ని చెబుతున్నారు. వారు అన‌మ‌తి ఇస్తేనే గ్రావెల్ క్వారీ నిర్వ‌హ‌ణ‌కు ఆమోదం ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టంచేశారు.

మ‌రోవైపు ఆరోప‌ణ‌లు మరో విధంగా ఉన్నాయి. ఇక్క‌డి స‌ర్వే నంబ‌ర్ 83లో 143.13 ఎక‌రాల గుట్ట ఉండగా, 12.475 ఎకరాల్లో గ్రావెల్ త‌వ్వేందుకు త‌హ‌శీల్దార్ నుంచి న‌గ‌ర పాల‌క సంస్థ‌కు ఓ లేఖ వెళ్లింది. అయితే ఈ ప్ర‌తిపాద‌న కౌన్సిల్-లో అనేక ఆరోప‌ణ‌ల మ‌ధ్య గంద‌ర‌గోళం మ‌ధ్య ఆమోదానికి నోచుకుంది. గ్రావెల్ త‌వ్వ‌కానికి అధికార పార్టీ కార్పొరేట‌ర్లు కూడా అభ్యంత‌రాలు తెలుపుతున్నారు. ఇక వీటికి సంబంధించి రెవెన్యూ, భూగ‌ర్భ గ‌నుల శాఖ ఆమోదాలు ఇవ్వ‌డ‌మే మిగిలి ఉంది.

ఎమ్మెల్యేకు చెందిన ఓ క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీ ప‌లు చోట్ల గ్రావెల్ త‌వ్వ‌కాల‌కు అనుమ‌తులు కోర‌గా వీటికి కూడా కౌన్సిల్ అనేక అభ్యంత‌రాల న‌డుమే అంగీకారం తెలిపింది. ఎలా లేద‌న్నా 83 ఎక‌రాల స్థ‌లంలో గ్రావెల్ త‌వ్వ‌కాల‌కు సంబంధించి లీజు పొందేందుకు ఎమ్మెల్యే ఆరాటం చూపిస్తున్నార‌ని తెలుస్తోంది.

కానీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా గ్రావెల్ త‌వ్వ‌కాలు ఎలా చేప‌డ‌తార‌ని విప‌క్షం ప్ర‌శ్నిస్తోంది. ప్ర‌భుత్వ భూముల నుంచి గ్రావెల్ త‌వ్వ‌కాల‌కు ఎమ్మెల్యే ఎందుకు ఆరాటం చూపుతున్నారంటే త్వ‌ర‌లో ఇక్క‌డ రెండు ప్ర‌ధాన ర‌హ‌దారుల ప‌నుల ప్రారంభంకు సంబంధిత యంత్రాంగం మొగ్గు చూప‌డ‌మే ! చిత్తూరు - త‌చ్చూరు, బెంగ‌ళూరు - చెన్న‌య్ పేరిట ఎక్స్‌ప్రెస్ వే ల నిర్మాణానికి గ్రావెల్ అవ‌స‌రం కావ‌డంతో ఎమ్మెల్యే త‌న ప‌రప‌తి ఉపయోగించి ప్ర‌భుత్వ భూముల్లో గ్రావెల్ త‌వ్వ‌కాల‌కు అనుమ‌తులు కోరుతున్నారు