Begin typing your search above and press return to search.

శివసేకు సెలబ్రెటీల నుంచి డబ్బులు అందుతున్నాయా..?

By:  Tupaki Desk   |   20 Oct 2021 9:45 AM GMT
శివసేకు సెలబ్రెటీల నుంచి డబ్బులు అందుతున్నాయా..?
X
డ్రగ్స్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుంది. ఈనెల 2న ముంబై టు గోవా వెళ్తున్న షిప్లో పట్టుబడిన ఆర్యన్ ఖాన్ ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఆయన బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ఇప్పటికీ నాలుగుసార్లు బెయిల్ పిటిషన్ ను కోర్టుకొట్టివేసింది. మరికొన్ని రోజులు ఆర్యన్ ఖాన్ రిమాండ్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయితే ఆర్యన్ ఖాన్ అరెస్టు రాజకీయంగా వివాదం ముసురుకుంటోంది. ఎన్సీబీ సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేసి దాడులు చేస్తోందని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఎన్సీబీ చీఫ్ తన వ్యక్తిగత కుట్రలో భాగంగానే ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేయాల్సి వచ్చిందని అంటున్నారు.

నార్గోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించింది. తమకు ఎక్కడ సమాచారం అందినా అక్కడికి వెళ్లి దాడులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఎన్సీబీ చీఫ్ సమీర్ వాఖండే డ్రగ్స్ మాఫియాకు సింహస్వప్నంలా మారాడని అంటున్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు చేసిన తరువాత ఆయన ద్వారా డ్రగ్స్ మూలాలను తెలుసుకుంటున్నారని, అంతేకాకుండా ఆర్యన్ ఖాన్ ద్వారా 130 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే మరింత లోతుగా విచారణ జరిపి డ్రగ్స్ మాఫియాను మూలాలను తెంచేలా కృషి చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఇదిలా ఉండగా ఎన్సీబీ చీఫ్ సమీర్ వాఖండే సతీమణి మరాఠీ నటి క్రాంతి రేద్కర్. ఈమెను బాలీవుడ్ ఇండస్ట్ర పలు సినిమాల్లో రిజెక్టు చేసిందనే నెపంతో వాఖండే సినీ తారలపై కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సినీ పరిశ్రమపై ఉన్న పగ, ప్రతీకారంతోనే నటులపై డ్రగ్స్ పేరిట దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కూడా షారుఖ్ ఖాన్ ను టార్గెట్ చేసి ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారని అంటున్నారు. ఈ మేరకు శివసేన నేత కిశోర్ తివారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాఖండే భార్య సినీ పరిశ్రమలో రాణించలేకపోయిందని, అందుకే వ్యక్తిగత ప్రయోజనాల కోసం సినీ తారలపై డ్రగ్స్ పేరిట దాడులు చేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.

మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సైతం ఎన్సీబీపై ధ్వజమెత్తారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ తారలు తప్ప మరెవరు లేరా..? అని ప్రశ్నించారు. దేశంలో ఎంతో మంది డ్రగ్స్ కు బానిసలవుతుండగా సినీ తారలను ఎందుకు టార్గెట్ చేసినట్లు..? అని అన్నారు. ఇది ప్రత్యక్షంగా కక్షపూరితమైన చర్యలేని అని విమర్శించారు.

శివసేన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదమ్ మాట్లాడారు. దేశంలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేస్తున్న వారిని పోత్సహించాల్సింది పోయి వారికి సపోర్టు చేస్తారా..? అని విమర్శించారు. ఎన్సీబీకీ వ్యక్తిగతంగా ఆర్యన్ ఖాన్ పై ఎలాంటి దురుద్దేశం లేదు. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ పై ఎలాంటి శత్రుత్వం లేదు. అయితే డ్రగ్స్ మాఫియాకు శివసేన మద్దతు పలుకుతుందా..? అని అన్నారు. లేక శివసేకు సెలబ్రెటీల నుంచి డబ్బులు అందుతున్నాయా..? అని ఆరోపించారు.

ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఇవ్వడం లేదు. ఇప్పటికీ నాలుగుసార్లు బెయిల్ కోరగా కోర్టు రిజెక్టు చేసింది. మరోసారి ఈనెల 20న కోర్టు విచారణ జరపనుంది. అయితే ఆర్యన్ ఖాన్ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నాయని, ఆయన బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు సుమోటాగా తీసుకోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది.