Begin typing your search above and press return to search.

మందుబాబులపై మరో పిడుగు!

By:  Tupaki Desk   |   11 Jun 2020 3:45 AM GMT
మందుబాబులపై మరో పిడుగు!
X
పొగతాగనివాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీశం. కానీ మందు తాగని వాడు కూడా ఇప్పుడు అలాగే ఏదో ఒకటి అయి పుడుతారు అంటున్నారు ఆధునిక గిరీషంలు. మద్యం లేనిదే సమాజమే లేదు. లాక్ డౌన్ వేళ ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. ఇప్పుడు సడలింపుల తర్వాత అందరూ తలా ఒక పెగ్గు వేసుకుంటూ హాయిగా పడుకుంటున్నారు. అలాంటి మందుబాబులపై సరికొత్త పిడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం.

జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు మద్యం అమ్మవద్దని తాజాగా తెలంగాణ ఎక్సైజ్ విభాగం హైదరాబాద్ పరిధిలోని అన్ని వైన్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులకు వచ్చే కస్టమర్లకు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా జ్వరం ఉందో లేదో మొదట పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటేనే వారిని మద్యం కొనడానికి కౌంటర్ వద్దకు వెళ్లడానికి అనుమతిస్తారు.

ఇక కరోనా వైరస్ హైదరాబాద్ లో పెరుగుతున్న దృష్ట్యా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయడంతోపాటు ‘నో మాస్క్-నో లిక్కర్’ అనే బోర్డులను ప్రదర్శించాలని దుకాణ యాజమానులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సూచించింది. ఖచ్చితంగా ప్రతీ వైన్ షాప్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు ఉంచుకోవాలని ఆదేశించింది.

అయితే జ్వరంతో ఉన్న వారికి మద్యం అమ్మడం అనే నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధన వృథా అంటున్నారు. ఎవరైతే జ్వరంతో ఉంటారో వారి సన్నిహితులు, స్నేహితుల ద్వారా మద్యం తెచ్చుకునే అవకాశం ఉంటుంది.కాబట్టి జ్వరంతో ఉన్నవారు మద్యం షాపుకు వచ్చి మరీ కొనాల్సిన అవసరం ఉండదు.