Begin typing your search above and press return to search.

ఈటల రాజేందర్ కు మరో షాక్

By:  Tupaki Desk   |   14 Oct 2021 5:12 AM GMT
ఈటల రాజేందర్ కు మరో షాక్
X
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది.

తాజాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరాపణలతో కూడిన కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన బీజేపీ అభ్యర్థి ఈటలపైన, ఆ పార్టీపైనా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

అలాగే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తోపాటు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పై విరుచుపడుతున్నారు. వారి అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ పలు కేసులపై ఆధారాలతోపాటు కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడి, హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ నిర్వహించడంపై కూడా ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతోపాటు డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటలరాజేందర్ ఓటర్లను తప్పుదోవ పట్టించడంపై ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వీటన్నింటిపై ఆధారాలతో సోమ భరత్ ఫిర్యాదు చేశారు.