Begin typing your search above and press return to search.

అశోక్‌కు మ‌రో షాక్‌.. మాన్సాస్ ట్ర‌స్ట్ కోసం.. కోర్టుకెక్కిన‌ ఊర్మిళ

By:  Tupaki Desk   |   9 Aug 2021 2:32 PM GMT
అశోక్‌కు మ‌రో షాక్‌.. మాన్సాస్ ట్ర‌స్ట్ కోసం.. కోర్టుకెక్కిన‌ ఊర్మిళ
X
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు ఒక‌టి త‌ర్వాత‌.. ఒక‌టి చిక్కులు వీడ‌డం లేదు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న అన్న ఆనంద గ‌జ‌ప‌తి రాజు మొద‌టి భార్య కుమార్తె సంచ‌యిత గ‌జ‌ప‌తి రాజు నుంచి తీవ్ర స్థాయిలో త‌ల‌నొప్పులు ఎదుర్కొన్నారు. కీల‌క‌మైన మాన్సాస్ ట్ర‌స్ట్ ప‌ద‌వి స‌హా.. వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తున్న సింహాచ‌లం దేవ‌స్థానం.. చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం రాత్రికి రాత్రి.. సంచ‌యిత‌కు క‌ట్ట‌బెట్టింది. దీంతో ప‌ద‌విని కోల్పోయిన అశోక్.. న్యాయ‌పోరాటం చేసి.. వాటిని దాదాపు ఏడాది కాలం త‌ర్వాత ఇటీవలే ద‌క్కించుకున్నారు. హ‌మ్మ‌య్య‌! అని అశోక్ ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలోఅటు ప్ర‌భుత్వం ఇటు సంచ‌యితలు ఇద్ద‌రూ కూడా మ‌రోసారి హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. వీటిపై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది.

హైకోర్టు జోక్యంతో..
కానీ, ఇంత‌లోనే మ‌రో పెద్ద ఇబ్బంది అశోక్‌కు ఎదురైంది. జ‌గ‌న్ స‌ర్కారు జారి చేసిన స‌ర్క్యుల‌ర్‌ను అడ్డు పెట్టుకున్న ఆనంద గ‌జ‌ప‌తిరాజు రెండో స‌తీమ‌ణి కుమార్తె.. ఊర్మిళ గ‌జ‌ప‌తిరాజు.. మాన్సాన్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ స‌హా సింహాచ‌లం దేవ‌స్తానం చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను త‌న‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ.. హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇప్ప‌టికే సంచ‌యితతో న్యాయ పోరాటం చేసిన అశోక్‌కు ఇప్పుడు ఊర్మిళ వంతు వ‌చ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. వంశ పారంప‌ర్యంగా అటు మాన్సాస్‌కు, ఇటు సింహాచ‌లం దేవ‌స్థానానికి కూడా చైర్మ‌న్‌గా అశోకే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. వైసీపీ స‌ర్కారు రావ‌డంతో ఆయ‌న‌కు చిక్కులు ఏర్ప‌డ్డాయ‌ని టీడీపీ నేత‌లు చెబుతుంటారు.

మంగ‌ళ‌వారం ఏం తేలుతుంది?

ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను వాటి నుంచి త‌ప్పిస్తూ.. సంచ‌యిత‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు.. అయితే.. ఇటీవ‌ల హైకోర్టు వీటిని కొట్టేసింది. కానీ, ఇప్పుడు.. ప్రభుత్వం తనను, సంచయితను వారసులుగా గుర్తించిందని, కాబ‌ట్టి సంచయిత కానీ పక్షంలో తనను మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టు బోర్డుల‌కు చైర్మన్‌గా నియమించాలని ఊర్మిళ కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. ఇదిలావుంటే, ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయితను మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ప్రభుత్వం గతేడాది మార్చిలో నియమించింది.

వ‌రుస వివాదాలు

అయితే వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్టులో వయస్సులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలని.. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా ట్రస్టుల ఛైర్మన్ నియామకం చేపట్టిందని అశోక్ గజపతిరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అశోక్ గజపతిరాజు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సంచయిత నియామక ఉత్తర్వుల్ని కొట్టివేసింది. ట్రస్టు చైర్మన్‌గా తిరిగి అశోక్ గజపతిరాజును నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ఆ మేరకు అశోక్ గజపతిరాజు తిరిగి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కానీ, ఇప్పుడు మ‌రోసారి ఇది వివాదానికి దారి తీసింది.

ఇదీ చ‌రిత్ర
విజయనగరం జిల్లాకు చెందిన‌ పూసపాటి గజపతి రాజుల వంశంలో చిట్టచివరి క్రౌన్ ప్రిన్స్ అయిన పూసపాటి విజయరాం గజపతి రాజు(పీవీజీ రాజు) తన తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక నారాయణ సోసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్‌(మాన్సాస్)ను 1958 నవంబర్ 12న ఏర్పాటు చేశారు. విద్య, సంగీతం, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ ఈ మాన్సాస్ ట్రస్టు‌ను నెలకొల్పారు. మాన్సాస్ నిర్వహణ కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కలపి మొత్తం దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు (ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి) పైగా విలువైన 14,800 ఎకరాల భూమి సాంకేతికంగా ఈ ట్రస్టు నియంత్రణలో ఉంది. ఇంతే కాకుండా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. వీటికి ఇటీవ‌ల వ‌ర‌కు కూడా అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. తాజా ప‌రిణామంపై అశోక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.