Begin typing your search above and press return to search.

పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ కుదుపు .. ఏమైందంటే

By:  Tupaki Desk   |   18 Nov 2021 5:30 PM GMT
పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ కుదుపు .. ఏమైందంటే
X
పంజాబ్ లో కాంగ్రెస్‌ నేతల మధ్య భేదా భిప్రాయాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పాకిస్థాన్‌ లోని కర్తార్‌ పూర్ సాహిబ్ సందర్శన కు వెళ్తున్న బృందం లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకు స్థానం కల్పించకపోవడమే దీనికి కారణం. సీఎం చరణ్‌ జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ఈ బృందం గురువారం కర్తార్‌ పూర్‌ లోని గురు నానక్ గురుద్వారా ను సందర్శిస్తుంది. ఈ బృందంలో పంజాబ్ కేబినెట్ మంత్రులు ఉన్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ బృందంలో ఉండవచ్చునని వార్తలు వెలువడుతున్నాయి.

సిద్ధూ ఈ నెల 20న కర్తార్‌ పూర్ సాహిబ్‌ ను సందర్శిస్తారని ఆయన మీడియా సలహాదారు సురేంద్ర దలాల్ తెలిపారు. పంజాబ్ ప్రభుత్వానికి అన్ని పత్రాలను నిన్న సమర్పించాం. కేబినెట్‌తోపాటు ఆయన ఈరోజు కర్తార్‌ పూర్ సాహిబ్‌ ను సందర్శించవలసి ఉంది. మొత్తం కేబినెట్ ఈరోజు వెళ్తుండగా, ఆయన నవంబరు 20న వెళ్ళవచ్చునని పంజాబ్ ప్రభుత్వం ఆయన కు ఎందుకు చెప్పిందో తెలియడం లేదు అని చెప్పారు. గురు నానక్ జయంతి ఉత్సవాలు నవంబరు 19న జరుగుతాయని, సిద్ధూను వదిలేయడానికి కారణమేమిటని ప్రశ్నించారు. దీనికి సమాధానం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పగలదన్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి సమస్య లేదన్నారు. పొరపాటు జరిగిందంటే అది పంజాబ్ ప్రభుత్వం వల్లే జరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు. కర్తార్‌ పూర్ కారిడార్‌ ను నవంబరు 17 నుంచి తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో దీనిని మూసేసిన సంగతి తెలిసిందే. సిక్కులు ఈ మార్గంలో ప్రయాణించి పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శిస్తారు. బీజేపీ ప్రతినిధుల బృందం కూడా ఈ చారిత్రక గురుద్వారాను గురువారం సందర్శిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం వెళ్లబోతోంది.గురు నానక్ జయంతినే గురు నానక్ గురు పరబ్ అని కూడా అంటారు. ఈ ఉత్సవాలు కార్తిక పౌర్ణమినాడు ఘనంగా నిర్వహిస్తారు.