Begin typing your search above and press return to search.

కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో చిచ్చు

By:  Tupaki Desk   |   25 Jan 2022 5:35 AM GMT
కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో చిచ్చు
X
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాజాగా మరో చిచ్చు మొదలైంది. ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పైన కూడా తమ పెత్తనమే చెల్లుతుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రాల్లో పనిచేస్తున్న పై క్యాటగిరీల అధికారుల్లో ఎంతమందిని కేంద్రానికి డిప్యుటేషన్ మీద పంపాలో కేంద్రమే నిర్ణయిస్తుందని ఫైనల్ చేసింది. దీనిలో భాగంగానే పై క్యాటగిరీల అధికారుల సర్వీసు నిబంధనలను కూడా మార్చబోతున్నట్లు రాష్ట్రాలకు కేంద్రం నుంచి సమాచారం అందింది.

తమ నిర్ణయంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీనిపై తెలంగాణా సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తు కేంద్రానికి తాజాగా లేఖ రాశారు. కేంద్రానికి తమ నిరసన తెలుపుతూ ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు లేఖలు రాసిన విషయం తెలిసిందే. పై క్యాటగిరీల అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే కేంద్రం సర్వీసు నిబంధనల్లో మార్పులు చేస్తోందంటూ పై సీఎంలు మండిపడుతున్నారు.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించినట్లే అంటు కేసీయార్ మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తన లేఖలో స్పష్టంగా చెప్పేశారు. అయినా కేంద్రం తన నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యింది. ఈ మధ్యనే పశ్చిమబెంగాల్లో, తెలంగాణా, పంజాబ్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు షాక్ తగిలింది.

బహుశా ఇలాంటి ఘటనలతో ప్రధాన మంత్రికి బాగా మండినట్లుంది. అందుకనే పై క్యాటగిరీల అధికారుల సర్వీసు నిబంధనల్లో మార్పులు తీసుకొస్తున్నారు.

ఒకసారి మార్పులు జరిగిపోతే మొత్తం ఆల్ ఇండియా సర్వీసు అధికారుల వ్యవస్ధంతా కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. కేంద్రం ఎప్పుడు ఎవరిని డిప్యుటేషన్ కు పంపమంటే కేంద్రం సర్వీసుకు పంపాల్సిందే. కాదనేందుకు రాష్ట్రాలకు అధికారం ఉండదు. డిప్యుటేషన్ విషయంలో అంతిమ నిర్ణయం కేంద్రానిదే అవుతుంది. కాబట్టే కొంతమంది ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.