Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఇంకో ఘోరం.. స్నేహితులతో కలసి బాలికపై అత్యాచారం..!

By:  Tupaki Desk   |   8 Jun 2022 4:11 AM GMT
హైదరాబాద్ లో ఇంకో ఘోరం.. స్నేహితులతో కలసి బాలికపై అత్యాచారం..!
X
వరుస అత్యాచారాలతో హైదరాబాద్ నగరం మారుమోగుతోంది. కొద్ది రోజుల క్రితం రొమేనియా బాలిక, పహడీ షరీప్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలను మరువకముందే మరో బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికతో ప్రేమాయణం సాగించిన ఓ విద్యార్థి తనతో పాటు మరో నలుగురితో కలిసి ఆమెను సామూహిక అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ గ్యాంగ్ రేప్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

హైదరాబాద్ నగరంలోని కార్ఖానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే పదో తరగతి విద్యార్థినికి సైదాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి (మైనర్‌) కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైంది. కొన్ని రోజులు ఆమెతో చాటింగ్‌ చేసిన బాలుడు ప్రేమ పేరుతో బాలికను ముగ్గులోకి దింపాడు. ఒకసారి కలిసి మాట్లాడుకుందాం రమ్మని పిలిచి.. కొత్తపేటలోని సింధూర హోటల్ కు తీసుకువెళ్లాడు.

బాలికతో మద్యం తాగించి.. మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తన స్నేహితుడైన వనస్థలిపురానికి చెందిన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి (మైనర్‌) తోపాటు డిగ్రీ చదువుతున్న రిషిత్‌ను (19) రప్పించాడు. మత్తులో ఉన్న బాలికపై వీరిద్దరు సైతం లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆ బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వచ్చారు.

అత్యాచారానికి పాల్పడ్డ రెండు రోజుల తర్వాత మార్చి 3న బాలిక స్నేహితుడు ఆ బాలికకు మళ్లీ ఫోన్‌ చేశాడు. ఆ రోజు జరిగినదంతా తన స్నేహితులు వీడియో రికార్డు చేశారని చెప్పి భయపెట్టాడు. అవి డిలీట్‌ చేయాలంటే తాను చెప్పిన చోటకు రావాలని చెప్పి ఎల్బీనగర్‌కు రప్పించాడు. అక్కడి ఓయో రాజ్‌స్టే లాడ్జికి బాలికను తీసుకువెళ్లాడు. అక్కడ మరోసారి ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు.

Rఅంతేకాకుండా తన మరో ఇద్దరు స్నేహితులైన బీహెచ్ఈఎల్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థి సాయి చైతన్య (20), బీబీఏ విద్యార్థి శౌర్యలను (20) అక్కడకు పిలిపించాడు. మద్యం మత్తులో ఉన్న బాలికపై వీళ్లూ అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు తెల్లవారుజామున బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వచ్చారు.

రెండుసార్లు సామూహిక అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర షాక్‌కు లోనైంది. అర్ధరాత్రి దాటే వరకు బయట ఉండి వచ్చిన ఆమెను తల్లిదండ్రులు మందలించడంతో ముభావంగా ఉంటూ తరచూ భయపడుతోంది. దీంతో తల్లిదండ్రులు బాలికను ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు.

అక్కడ బాలిక నోరు విప్పడంతో లైంగిక దాడి విషయం వెలుగు చూసింది. దీంతో బాలిక తండ్రి కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు మైనర్లు సహా ముగ్గురు నిందితులను జూన్ 1న పట్టుకున్నారు. మరుసటి రోజు మేజర్లను జైలుకు, మైనర్లను జువైనల్‌ హోమ్‌కు తరలించారు. బాలికను తీసుకెళ్లడానికి వినియోగించిన రిషిక్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. లాడ్జిల యజమానులను కూడా నిందితులుగా చేర్చారు.