Begin typing your search above and press return to search.

రాజ్యసభకు మరో ఫైర్ బ్రాండ్ !

By:  Tupaki Desk   |   16 March 2020 5:19 AM GMT
రాజ్యసభకు మరో ఫైర్ బ్రాండ్ !
X
రాజ్యసభ ..పెద్దల సభ. ఈ సభకి దేశంలో చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలోని కీలక నేతలని , సంఘంలో ప్రజల కోసం పోరాడే నాయకులని , విద్యావేత్తలని , ప్రముఖ రంగాలలో ఉన్నతశిఖరాలని అధిరోహించిన వారిని ఈ సభకి నామినేట్ చేస్తారు. ఎంపీ హోదా ఉండే ఈ రాజ్యసభ టికెట్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. అయితే , అందరికి రాజ్యసభ సభ్యత్వం దక్కదు. అదృష్టం తో పాటుగా ప్రజా మద్దతు , పార్టీ మద్దతు చాలా ముఖ్యం.

ఇకపోతే , తాజాగా రాజ్యసభ లో ఖాళీ అయిన సీట్లని భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభ కి వెళ్లేవారి పేర్లు కూడా దాదాపుగా ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా మహారాష్ట్ర నుండి అందాల తార రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ఆమె మరెవరో కాదు .. ప్రియాంక చతుర్వేది. కొన్ని రోజుల ముందు వరకు ఈమె పేరు సౌత్ లో పెద్ద‌గా తెలియ‌దు. అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన‌ప్పుడు సౌత్ లో ఈమె పేరు బాగా వినిపించింది. 2010 లో కాంగ్రెస్ పార్టీలో చేరి, రెండేళ్లలోనే నార్త్‌ వెస్ట్‌ ముంబై జాతీయ యువజన కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అయితే ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ లో కొందరు ఆమెతో అమర్యాదగా ప్రవర్తించినప్పుడు.. వారిని పార్టీనుంచి బయటికి పంపించిన కాంగ్రెస్‌.. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్లను వెనక్కు తీసుకోవడం తో ఆగ్రహించి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు.

అలా కాంగ్రెస్ నుండి బయటకి వచ్చిన ప్రియాంక చతుర్వేది ఆ తరువాత శివసేన లో జాయిన్ అయ్యారు. పార్టీలో నేను మామూలు శివసైనికురాలిగా ఉంటాను అని ఆమె శివసేన లో జాయిన్ అయినప్పటికీ , ఆమెలోని నాయకత్వ పటిమ చూసి ..ఆమెని రాజ్యసభకు పంపిస్తున్నారు. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముందే.. ఈమె శివ‌సేన లో చేరిపోయారు. ఇంత‌లోనే ఈమెకు ఏకంగా రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌డం గ‌మ‌నార్హం. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా మంచి కాలమిస్టుగానే ఆమెకు పేరు. బాగా రాస్తారు, రాసినంత బాగా మాట్లాడతారు.

కాగా , శివసేన లో ఈమె కంటే ఇంకా ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ , ఈ మద్యే పార్టీలో చేరినా రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక మరో ప్రధాన కారణం ఉంది. అదేమిటి అంటే .. ప్రియాంక ఇంగ్లిష్‌ లో అనర్గళంగా మాట్లాడతారు. హిందీ కూడా బాగా మాట్లాడగలరు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చి మహారాష్ట్రలో స్థిరపడిన కుటుంబం కనుక మరాఠీలో కూడా ఘనురాలే. మహారాష్ట్రలో ఉండేవారంతా మరాఠీలోనే మాట్లాడాలని శివసేన అంటున్నా.. రాజ్యసభలో మాత్రం తన స్వరం వినిపించడానికి ఆ పార్టీకి ఇంగ్లిష్, హిందీ తప్పనిసరి అవుతోంది. దీనితో ఆమెని రాజ్యసభకి నామినేట్ చేసారు. ఈమె ప్రస్తుత వయస్సు 40 సంవ‌త్స‌రాలే. ఇంత‌లోనే పెద్ద‌ల స‌భకు ఈమెకు అవ‌కాశం ద‌క్క‌డం విశేషం. మోడీ పై ఒంటికాలు తో లేచే ఈమె ..రాజ్యసభలో సామాజికాంశాల లో తనకున్న పరిజ్ఞానం తో ఎలా అదరగొడుతుందో.