Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : భారత్‌లో మరో కరోనా మృతి ...

By:  Tupaki Desk   |   23 March 2020 6:37 AM GMT
బ్రేకింగ్ : భారత్‌లో మరో కరోనా మృతి ...
X
కరోనా వైరస్ దేశంలో ఊహించనంత వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. దేశంలోని రాష్ట్రాలన్నీ లాక్‌ డౌన్ చేయాలని కేంద్రం ఆదేశించింది. లాక్ డౌన్ కాదని ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 75 జిల్లాల్లోనే లాక్‌డౌన్ ప్రకటించగా, తాజాగా.. దేశంలోని అన్ని రాష్ట్రాలను లాక్‌ డౌన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు.. కరీంనగర్‌ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాజాగా 19 కేసులు నమోదైనట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది

ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రబోధకులతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వచ్చినట్లు తేలింది. అతడ్ని అధికారులు కరీంనగర్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇకపోతే ఈ ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌ లో మరో వ్యక్తి మృతిచెందాడు. తాజాగా కరోనా సోకి 68 ఏళ్ల వ్యక్తి ముంబై లో తుదిశ్వాస విడిచాడు. ఇది మహారాష్ట్రలో మూడో కరోనా మరణం కాగా, భారత్‌లో ఏడో మరణం. తాజాగా చనిపోయిన వృద్ధుడు ఫిలిప్పీన్స్‌ కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.

దేశంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 89కి చేరుకుంది. కాగా, శనివారమే ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో బాధపడుతూ మృతి చెందాడు. ఇకపోతే తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూ వస్తుంది, ఇప్పటి వరకు తెలంగాణ లో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.