Begin typing your search above and press return to search.

నిన్న న్యూజిలాండ్, నేడు ఇంగ్లండ్...పాక్ కి మరో ఎదురు దెబ్బ

By:  Tupaki Desk   |   21 Sep 2021 6:12 AM GMT
నిన్న న్యూజిలాండ్, నేడు ఇంగ్లండ్...పాక్ కి మరో ఎదురు దెబ్బ
X
పాకిస్థాన్ క్రికెట్ కి న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ నుండి కోలుకోకమునుపే , తాజాగా ఇంగ్లాండ్ మరో షాక్ ఇచ్చింది. సెక్యూరిటీ కారణాలతో న్యూజిలాండ్ టీం ఇప్పటికే పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కారణంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే సిరీస్‌ను ఇంగ్లండ్ టీం రద్దు చేసుకుంది. వచ్చే నెలలో జరిగే పాకిస్తాన్ పర్యటన నుంచి ఇంగ్లండ్ టీం కూడా తప్పుకుంది. పురుషులతోపాటు మహిళల జట్ల పర్యటనను రద్దు చేసుకుంది.

ఇంగ్లండ్ పురుషుల, మహిళల జట్లు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల నుంచి పర్యటించాల్సి ఉంది. ఇంగ్లండ్ పురుషుల జట్టు అక్టోబరు 13, 14 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, ఇంగ్లండ్ మహిళల జట్టు అక్టోబరు 17 నుంచి 21 వరకు మూడు వన్డేల సిరీస్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే, కివీస్ క్రికెట్ బోర్డు తరహాలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా భద్రతా పరమైన అంశాలను చూపుతూ పర్యటనకు తాము రాబోవడంలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించింది.

ఈ వారాంతంలో పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ మహిళలతోపాటు పురుషుల పర్యటన గురించి చర్చించడానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమావేశమైంది. అక్టోబర్ నుంచి ఈ రెండు జట్ల పర్యటనను ఉపసంహరించుకోవాలని బోర్డు అయిష్టంగానే నిర్ణయించింది అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.మా క్రీడాకారులు, సహాయక సిబ్బంది భద్రతకే మా అత్యంత ప్రాధాన్యం. ఇది మరింత క్లిష్టమైనది అంటూ ప్రకటించింది.పాకిస్తాన్‌ కు వెళ్లడం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయని మాకు తెలుసు. ఇప్పటికే కోవిడ్ పరిస్థితుల్లో బయో బబుల్‌లో ఆటగాళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. రానున్న సిరీస్‌ల కోసం ఆటగాళ్లను మరింత ఒత్తిడికి గురికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది అని పేర్కొంది.

వచ్చే నెలలో జరిగే ట్వంటీ 20 ప్రపంచకప్ కోసం పురుషుల జట్టు పాకిస్తాన్ లాంటి పరిస్థితులలో పర్యటించడం సరైనది కాదని ఈసీబీ ప్రకటించింది.తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ఆతిథ్యమివ్వడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన పీసీబీకి ఈ నిర్ణయం నిరాశను కలిగిస్తుందని మాకు తెలుసు అని పేర్కొంది. ఇది పాకిస్తాన్‌ లో క్రికెట్‌ పై ప్రభావం చూపుతున్నందుకు చింతిస్తున్నాం. 2022 కోసం మా ప్రధాన పర్యటనలపై ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నాం అని తెలిపింది. ఇప్పటికే తమ ఆటగాళ్లు కొవిడ్ సంబంధిత ఆంక్షలతో దీర్ఘకాలంగా ఒత్తిడిలో ఉన్నారని ఈసీబీ పేర్కొంది.

2009 లో లాహోర్‌ లో శ్రీలంక టీమ్ బస్సుపై ఇస్లామిస్ట్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులతో పాటు ఇద్దరు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అంతర్జాతీయ బృందాలు పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరిస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం రెండు దేశాలు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో సందర్శించాల్సిన ఆస్ట్రేలియా కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని పాక్ బోర్డు భయపడుతోంది. ఈ మేరకు పాక్ పిరస్థితులను క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షిస్తోందని, మరింత సమాచారం తెలిసిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడతాం అంటూ ఆసీస్ బోర్డులోని ఓ అధికారి తెలిపారు.