Begin typing your search above and press return to search.

వివేకా మృతిలో మరో కోణం..

By:  Tupaki Desk   |   15 March 2019 9:17 AM GMT
వివేకా మృతిలో మరో కోణం..
X
వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బాత్ రూంలో చనిపోయాడన్నది నిజం కాదని.. బెడ్ రూంలోనే చనిపోయాడని తెలుస్తోంది. ఆయన తలకు గాయం ఉండడం... బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పీఏ కృష్ణారెడ్డి మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు. రాత్రి వివేకానందరెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారని.. ఉదయం పనిమనిషితో కలిసి తాను వెళ్లేసరికి తీవ్రగాయాలతో బాత్ రూమ్ లో పడి ఉన్నారని వివరించారు. చేతిని పట్టుకొని చూడగా.. నాడీ కొట్టుకోలేదని తెలిపాడు. వెంటనే ఆయన భార్య సౌభాగ్యమ్మ, అల్లుడికి ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. బెడ్ రూమ్ లో ఏసీ ఆన్ లోనే ఉందని.. బెడ్ పక్కన చాలా రక్తం పడి ఉందని తెలిపారు. కానీ సార్ మాత్రం రక్తపు మడుగులో బాత్ రూంలో పడి ఉన్నాడని.. వెనుక వైపు డోర్ తెరిచి ఉండడంతో అనుమానం కలిగిందని వివరించాడు. ఆ డోర్ ఎందుకు తీసారనే విషయంపై అనుమానాలున్నాయని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వైఎస్ వివేకానందరెడ్డి శరీరంపై దెబ్బలున్నాయని.. ఆయన తలవెనుక రెండు గాయాలు.. నుదిటి భాగం, ముఖంపై, ముక్కుకు, అరచేతికి బలమైన గాయాలున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పీఏ ఫిర్యాదు మేరకు అనుమానం వచ్చిన పోలీసులు వైఎస్ వివేకా డెడ్ బాడీని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. వైఎస్ వివేకానందరెడ్డి డెడ్ బాడీని పరిశీలించిన వైద్యులు మొత్తం ఐదు చోట్ల ఆయన శరీరంపై గాయాలున్నాయని గుర్తించారు. తల వెనుక భాగంలో రెండు బలమైన గాయాలున్నాయని.. నుదిటి భాగంతోపాటు ముక్కుపైన, అరచేతిపైన గాయాలున్నాయని గుర్తించారు.

వైఎస్ వివేకానందరెడ్డి ఒకవేళ గుండెపోటుతోనే మరణించి ఉంటే బాత్రూంలోనే కాకుండా బెడ్ రూంలో రెండు లీటర్ల రక్తం ఎలా పడి ఉంటుందుని ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంటి వెనుకాల ఉన్న డోరు తెరిచి ఉండడం చూసి పలు అనుమానాలకు కారణమైంది.అంటే అర్థరాత్రి వేళ ఎవరైనా దుండగులు లోపలికి వెనుక భాగం నుంచి చొరబడి హత్యచేశారా అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ డెత్ మిస్టరీని వెంటనే ఛేదించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ఇక వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని.. ముమ్మాటికి హత్యేనని కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైఎస్ వివేకానంద మృతిపై అనుమానాలు తలెత్తడంతో ఆ మృతిపై ప్రత్యేక విచారణ కమిటీ (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు కడప ఎస్పీ ప్రకటించారు. రాజకీయ రంగు పులుముకుంటున్న ఈ సమయంలో దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఎస్పీ నిర్ణయించారు.