Begin typing your search above and press return to search.

ఫోర్జరీ కేసులో అనిల్ కుంబ్లేపై చర్యలకు హైకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   10 Aug 2019 1:18 PM GMT
ఫోర్జరీ కేసులో అనిల్ కుంబ్లేపై చర్యలకు హైకోర్టు ఆదేశం
X
భారత్ మాజీ క్రికెటర్, కోచ్ అనిల్ కుంబ్లేకి కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. అనిల్ కుంబ్లే భార్య చేతనా మాజీ భర్త కుమార్ వి. జాగిర్ దార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పాస్ పోర్టులో సంతకం ఫోర్జరీ కేసులో కుంబ్లేపై విచారణ చేయాలని బెంగళూరులోని కోరమంగళ పాస్ పోర్టు అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణ చేసిన వివరాలని కోర్టుకి సమర్పించాలని కోరింది. కాగా, 1986లో కుమార్ వి. జాగిర్ దార్ , చేతనా రామతీర్థలకు వివాహం జరిగింది. కుమార్ వి. జాగిర్ దార్, చేతనా రామతీర్థ దంపతులకు అరుణి అనే కుమార్తె పుట్టింది.

అయితే వ్యక్తిగత కారణాలు వల్ల 1999లో కుమార్ వి. జాగిర్ దార్, చేతనా రామతీర్థ దంపతులు విడాకులు తీసుకున్నారు. అనంతరం అనిల్ కుంబ్లే చేతనాను రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇక 2012లో చేతనాకి, తనకి పుట్టిన అరుణి... తన కుమార్తె అంటూ అనిల్ కుంబ్లే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కుమార్ ఫిర్యాదు చేశారు. పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యడానికి అనిల్ కుంబ్లే తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు పాస్ పోర్ట్ అధికారులకి తెలిపారు. కానీ పాస్ పోర్ట్ అధికారులు తన ఫిర్యాదుని పరిశీలించలేదని కుమార్ కోర్టుని ఆశ్రయించారు.

ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా కుమార్ పిటిషన్ ని పరిశీలించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బి. వీరప్ప నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ అనిల్ కుంబ్లే మీద చర్యలు తీసుకోవాలని కోరమంగళ పాస్ పోర్టు కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద పూర్తి విచారణ చేసి ఆ వివరాలని కోర్టుకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు సూచనలని పరిగణలోకి తీసుకున్న పాస్ పోర్ట్ అధికారులు కుంబ్లే ఫోర్జరీ సంతకంపై విచారణ చేస్తున్నారు.