Begin typing your search above and press return to search.

రిల‌య‌న్సు జియోకు త‌మ్ముడి పోటీ

By:  Tupaki Desk   |   12 Sep 2016 10:59 AM GMT
రిల‌య‌న్సు జియోకు త‌మ్ముడి పోటీ
X
టెలికాం సంస్థ‌ల‌న్నిటికీ షాక్ ఇస్తూ ముకేశ్ అంబాని మొద‌లుపెట్టిన రిల‌య‌న్సు జియో సృష్టించిన సంచ‌ల‌నం అంతాఇంతా కాదు. అయితే... ఇప్పుడు ముకేశ్ అంబానీ జియోకు మిగ‌తా కంపెనీల నుంచి కంటే సొంత త‌మ్ముడు అనిల్ అంబానీ నుంచే భారీ పోటీ మొద‌ల‌య్యేలా క‌నిపిస్తోంది. తాజాగా అనిల్ అంబానీ సంస్థ రిల‌య‌న్సు క‌మ్యూనికేష‌న్ ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ జియోకు గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

ఉచిత కాల్స్ - హైస్పీడ్ ఇంటర్నెట్ అంటూ బ్ర‌హ్మాండ‌మైన‌ ఆఫర్లతో వచ్చిన రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు మిగ‌తా కంపెనీలు తగ్గింపు రేట్లను ప్రకటిస్తున్న వేళ - ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా కొత్త ఆఫర్ ను ప్రకటించారు. రిలయన్స్ సిమ్ వాడుతున్న ప్రీపెయిడ్ జీఎస్ ఎం ఖాతాదారుల కోసం రూ. 40 రీచార్జ్ తో పూర్తి టాక్ టైంతో పాటు 1 జీబీ డేటాను ఫ్రీగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గతంలో రూ. 40తో రిలయన్స్ సిమ్ ను రీచార్జ్ చేసుకుంటే రూ. 32 టాక్ టైం వచ్చేది. ఇప్పుడు పూర్తి టాక్ టైంను ఇస్తామని చెప్పిన అనిల్ దానికి అదనంగా ఇస్తున్న రూ. 8 టాక్ టైంను పది రోజుల్లో వాడుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ టాక్ టైం ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు.. అయితే, ఇంత త‌క్కువ ధ‌ర‌కు 1 జీబీ డేటాను పూర్తి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన తొలి సంస్థ మాత్రం ఆర్ కామే. మ‌రి అన్నఆఫ‌ర్ కే ఉబ్బితబ్బిబ్బ‌వుతున్న వినియోగ‌దారులు త‌మ్ముడి ఆఫ‌ర్ కు ఎలా రెస్పాండ‌వుతారో చూడాలి.