Begin typing your search above and press return to search.

ఇక్కడ మాఫీ.... అక్కడ మోసం..

By:  Tupaki Desk   |   8 Aug 2018 5:08 PM GMT
ఇక్కడ మాఫీ.... అక్కడ మోసం..
X
రైతులు. ఎక్కడైనా ఒక్కటే. వారు తెలంగాణ వారైనా... ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వారైనా... తమిళనాడు అయినా... మహారాష్ట్ర అయినా... బిహార్ అయినా... దేశంలో ఎక్కడి రైతులైనా ఒక్కటే. వారు పడే కష్టాలు ఒక్కటే. తేడా ఏమిటంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని ఆదుకునే తీరు మాత్రమే. ఎన్నికలకు మంుదు రైతులే తమ ప్రాణమంటూ ప్రకటించిన పార్టీలు ఆ తర్వాత వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు - ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రం రైతు రుణ మాఫీ సాధ్యం కాని హామీ అని - తను అధికారంలోకి వస్తే రుణమాఫీ చేయలేనని స్పష్టంగా చెప్పేశారు. అయితే రైతులు మాత్రం అమాయకంగా చంద్రబాబు నాయుడ్ని నమ్మి ఆయనకు ఓట్లు వేశారు. అలాగే తెలంగాణలో కె.చంద్రశేఖర రావును గెలిపించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే కెసీఆర్ తాను చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చారు. అంతే కాదు రెండో విడత రుణమాఫీకి కూడా ఆయన సంకేతాలు పంపారు. ఈ మధ్యలో తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించారు. ఎకరానికి నాలుగు వేలు వంతున ఈ పెట్టుబడి సాయం ప్రకటించి దాన్ని విజయవంతంగా అమలు చేశారు. రెండో విడత రుణ మాఫీపై ఆయన మళ్లీ అధికారులతో సమీక్ష నిర్వహించి దాన్ని కూడా సమర్ధవంతంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రుణమాఫీ చేపట్టి రైతులకిచ్చిన హామీని నెరవేర్చారు. ఇది ఆయన మరోసారి ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావడానికి ఉపమోగపడుతుంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌ లో పరిస్ధితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడి రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు మాట తప్పారు. ఓ విధంగా రైతులను వంచించారు. ఆయన్ని నమ్మిన రైతులు గత ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేసి మోసపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రైతుల్లో ఆందోళన తారాస్ధాయికి చేరుకుంది.

తాజాగా కడప జిల్లాలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‍న్ రెడ్డిని అక్కడి రైతులు నిలదీసారు. కడప జిల్లాలోని రామాపురం గ్రామంలో మంత్రి సోమిరెడ్డి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న రైతులు రుణమాఫీ మాట ఏమిటంటూ మంత్రిని నిలదీసారు. 2013 సంవత్సరంలో తాము తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇస్తేనే తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని - ఇప్పటి వరకూ రుణమాఫీ గురించే పట్టించుకోలేదంటూ వారు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి సోమిరెడ్డి పరిస్ధితి ఇరకాటంలో పడింది. అక్కడి నుంచి తప్పించుకుందుకు ఆయన అష్టకష్టాలు పడ్డారు. వచ్చే ఏడెనిమిది నెలల్లో నాలుగైదు విడతలుగా రుణమాఫీని అమలు చేస్తామంటూ నోటికొచ్చింది మాట్లాడి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటనతో ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తెలుగుదేశం ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఒకేసారి ఎన్నికలు జరిగిన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ లలో రైతులు పరిస్థితి తెలంగాణలో హాయిగా.... ఆంధ్రప్రదేశ్‌ లో దారుణంగా తయారైంది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసానికి రైతులు వచ్చే ఎన్నికల్లో బదులు తీర్చుకోవాలనుకుంటున్నారు.