Begin typing your search above and press return to search.

ఖజానాకు కన్నం పెడుతున్న ‘తరలింపు’

By:  Tupaki Desk   |   22 Jun 2016 6:51 AM GMT
ఖజానాకు కన్నం పెడుతున్న ‘తరలింపు’
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు అంశం తక్షణం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అంతేకాదు... ఈ తరలింపు ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారాన్ని మోపనుంది. అంతేకాదు... తరలింపు వ్యవహారంలో ఎన్నో సమస్యలు - లోపాలు - అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. సచివాలయంలో మంత్రులు - ముఖ్యకార్యదర్శులు - కార్యదర్శుల కార్యాలయాలకు మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. అదీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సాధ్యపడేలాలేదు. హెచ్‌ ఓడిలకు సంబంధించి మీ కార్యాలయాలను మీరే వెతుక్కోండని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో రెట్టింపు అద్దెలతో లీజుల పందేరానికి తెరలేచినట్లు సమాచారం. కొందరు దళారులు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. తరలింపు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉంటే మూడేళ్లపాటు ప్రైవేటు భవనాలకు లీజులు ఎలా చెల్లించగలమని ఆర్థికశాఖ చేతులెత్తేస్తున్నట్లు తెలియవచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు హోటళ్లు - ఇతర ప్రైవేటు కాన్ఫరెన్స్ హాళ్లలో నిర్వహించిన సమీక్షా సమావేశాలకే ఇప్పటి వరకు చెల్లింపులు పూర్తికాలేదని చెబుతున్నారు. ఇప్పటికే 16వేల 200 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. ఇది మరో మూడేళ్లలో రూ. 20వేల కోట్లకు చేరుకుంటుందని స్వయాన ముఖ్యమంత్రే స్పష్టం చేశారు.

ఈ పరిస్థితుల్లో 70 మంది హెచ్‌ ఓడిలకు ప్రైవేటు భవనాలలో కోరుకున్నచోట కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించటంలోని ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కో హెచ్‌ ఓడి కార్యాలయానికి లక్ష నుంచి లక్షన్నర వరకు ప్రాంతాన్ని బట్టి భవనాలను లీజుకు తీసుకోనున్నారు. దీంతో పాటు ఉద్యోగినులకు హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా - గుంటూరు జిల్లాల కలెక్టర్లు కొన్ని ప్రైవేటు భవనాలను కార్యాలయాలకు సిద్ధం చేసినా కొన్నిచోట్ల పార్కింగ్ వసతి - ఇతర సౌకర్యాలు లేవన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సకల వసతులతో కూడిన కార్యాలయాలకు రెట్టింపు అద్దె చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం మూడేళ్ల లీజు ప్రాతిపదికన ఒప్పందాలను కుదుర్చుకోవాలని సూచించింది. ఇంత ఖర్చుచేసినా ఉద్యోగులు పూర్తిస్థాయిలో తరలివచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయటంలేదు.

తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలతో పాటు ప్రభుత్వశాఖల కార్యదర్శులు - ముఖ్య కార్యదర్శులకు స్థాయికి సరిపోను భవనాలను అద్దెకు తీసుకోవాలంటే రూ. 25వేల నుంచి 50వేలు నెలసరి అద్దె చెల్లించాల్సి వస్తుందని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. అయితే.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్నందున ఐఏఎస్‌లు రెయిన్ ట్రీపార్కులో విల్లాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. గతంలో ఏకమొత్తంలో ఇందులో ఫ్లాట్లు, విల్లాలు లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నెలవారీ అద్దె రూ. 15 నుంచి 50 వేల వరకు ఉన్నందున ఖర్చుకు వెనక్కు తగ్గింది. ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్‌ ల కోసం కనీసం 50 నుంచి 100 ఫ్లాట్ల వరకు అద్దెకు తీసుకోక తప్పదని చెబుతున్నారు. అంటే ఏడాదికి దీనిపై ఎంత ఖర్చవుతుందనేది అంచనా వేయవచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో తరలింపు వ్యవహారంపై విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. తరలింపు తరువాత ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని.. అద్దెల చెల్లింపు ఖజానాకు కష్టమవుతుందని అంటున్నారు.