Begin typing your search above and press return to search.

వారి మీద బాబుకే కాదు..సీమాంధ్రులకూ మండుతోంది

By:  Tupaki Desk   |   4 Jun 2016 4:23 AM GMT
వారి మీద బాబుకే కాదు..సీమాంధ్రులకూ మండుతోంది
X
ఆఖరి క్షణంలో ఏదో ఒకటి జరగదా?.. కాస్త ఒత్తిడి తెస్తే ఓకే అనే అవకాశం ఉందేమో? వేలాది మంది ఉద్యోగులతో పెట్టుకోవటం చంద్రబాబుకు ఇష్టం ఉండదు.. అందుకే ఆయనపై ఒత్తిడి తెస్తే మరో ఏడాది గడిపేయొచ్చు లాంటి మాటలు ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఈ నెల మూడో వారంలో.. అంటే మరో 20 రోజుల్లో (ఒకట్రెండు రోజుల తేడాతో) హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లాల్సిన నేపథ్యంలో తమ ప్రయాణాన్ని వాయిదా వేసేలా బాబు మీద ఒత్తిడి తెచ్చు ప్రయత్నం మరోసారి మొదలైంది.

సచివాలయాన్ని ఈ జూన్ చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో తరలించాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు స్పీడ్ కు తమ ఒత్తిడితో బ్రేకులు వేయాలన్న ఆలోచనలో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఇందుకోసం తమకు అవకాశం ఉన్న ప్రతి ప్రయత్నాన్ని చేస్తున్న ఏపీ ఉద్య్గోగుల తీరుపై బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో మాదిరి కాకుండా.. ఏపీ ఉద్యోగుల విషయంలో.. వారి సమస్యల విషయంలో తానెంతో సానుకూలంగా స్పందిస్తున్నా.. హైదరాబాద్ విడిచి రావటానికి ఉద్యోగులు ఏ మాత్రం సిద్ధంగా లేకపోవటంపై బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

అమరావతి ప్రయాణానికి బ్రేకులు వేసేలా పావులు కదుపుతున్న వారి పట్ల మండిపాటుతో పాటు.. ‘ఇలాంటివి కుదరవు. అనుకున్న గడువు లోపు అమరావతికి రావాల్సిందే’ అంటూ చంద్రబాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరికి ఎలాంటి మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదన్న విషయాన్ని బాబు తేల్చేయటమే కాదు..కష్టకాలంలో ఉన్నప్పుడు కలిసి రావాల్సిన ఉద్యోగులు ఇలా పేచీలు పెట్టటం ఏమిటంటూ బాబు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఏపీ సచివాలయ ఉద్యోగులు కిందామీదా పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందరూ త్యాగాలు చేస్తున్నప్పుడు ఏపీ సచివాలయ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటామనటంలో అర్థం లేదు. బాధను పంచుకోనోళ్లు భారమే అవుతారే తప్ప ఏపీ ప్రజల్లో భాగం కాలేరన్న విషయాన్ని మర్చిపోకూడదన్న మాట సీఎం నోట కాకుండా సీమాంధ్రుల నోట రావటాన్ని గుర్తిస్తే మంచిదన్న హితవు వినిపిస్తోంది. సొంత ప్రయోజనాలు తప్పించి.. ప్రజాప్రయోజనాలు ఏ మాత్రం పట్టని ఏపీ సచివాలయ ఉద్యోగులకు తమ పట్ల సీమాంధ్రలోని ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదేమో? తాము కట్టే పన్నులను జీతాలుగా తీసుకునే ఏపీ సచివాలయ ఉద్యోగులు.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉండిపోతామన్న వాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.