Begin typing your search above and press return to search.

సచివాలయం రెడీ.. ఉద్యోగుల విభజనలో ఢీ

By:  Tupaki Desk   |   14 April 2016 7:44 AM GMT
సచివాలయం రెడీ.. ఉద్యోగుల విభజనలో ఢీ
X
రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎస్‌ ఓ - ఏఎస్‌ ఓల విభజనపై ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన శాఖల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తయినప్పటికీ అన్ని శాఖలకు చెందిన ఎస్‌ ఓ - ఏఎస్‌ ఓల విభజన మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం శరవేగంగా సాగుతున్న తరుణంలో ఉద్యోగుల విభజన ఆలస్యం కానుండడంతో ఉద్యోగుల తరలింపు ఎప్పటికి పూర్తవుతుందో అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.

ఉద్యోగుల విభజన కమలనాథన్ కు తలనొప్పిగా మారింది. సచివాలయంలోని సెక్షన్‌ అధికారులు - అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారుల విభజనపై జరిగిన కమల్‌ నాథన్‌ కమిటీ సమావేశం రచ్చరచ్చగా మారింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 67మంది ఏఎస్‌ ఓలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు సంఘం సంఘీభావం తెలిపింది. ఏపీ ఉద్యోగులు కావాలనే ఆందోళన సృష్టించి తమకు నష్టం కలిగిస్తున్నారని టీ ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చారు. సమావేశం రచ్చరచ్చ కావడంతో చివరకు వాయిదా వేయాల్సి వచ్చింది.

కాగా తెలంగాణకు చెందిన 87 మంది ఎస్‌ ఓలు తెలంగాణలోనే కొనసాగించాలని టీ ఉద్యోగుల వాదన. సీనియారిటీ ప్రాతిపదికపై కోర్టులో స్టే ఉందని, ముందుగా సీనియారిటీ పూర్తి చేసిన తర్వాతే విభజన జరపాలని తెలంగాణ ఉద్యోగులు వాదిస్తున్నారు. సీనియారిటీ అమలు చేయకుండా విభజన చేస్తే తెలంగాణ ఉద్యోగులకు తీరని నష్టం కలుగుతుందని కమల్‌నాథన్‌కు వివరించారు. ఆప్షన్‌ లు ఇచ్చిన 44 మంది తెలంగాణకు రావాలని చూస్త్తున్నారని, తెలంగాణలో ప్రమోషన్లు వర్తింపజేయకపోవడంతో తమకు నష్టం కలుగనుందని టీ ఉద్యోగులు వాదిస్తున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఉద్యోగుల విభజన అంత సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు.