Begin typing your search above and press return to search.

తెరాస పెద్దలెవరూ నోరెత్తలేదు పాపం!

By:  Tupaki Desk   |   29 July 2017 3:56 PM GMT
తెరాస పెద్దలెవరూ నోరెత్తలేదు పాపం!
X
‘మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి మాష్టారూ’ అంటూ తెరాసకు చెందిన సీనియర్ నాయకులు - మంత్రులు ఎవరికి వారే తప్పించుకోవడానికి చూసిన సంఘటన ఇది. తమ నాయకుడు చెప్పిన కొన్ని మాటలకు సంబంధించి, తమలో ఎవ్వరికీ పూచీ తీసుకోవడం ఇష్టం లేదన్నట్లుగా.. పాత మిత్రులు ఎదురుగా నిలబడి నిలదీసి ప్రశ్నలు అడుగుతోంటే ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నమే చేశారు తప్ప.. సరిగ్గా సమాధానం చెప్పనే లేదు. ఈ తమాషా ఘటన హైదరాబాదులో రామోజీరావు పెళ్లి వేదిక వద్ద చోటు చేసుకుంది. ఇంతకు ఇదంతా దేనికి సంబంధించిందా అనుకుంటున్నారా?

గులాబీ బాస్ కేసీఆర్.. రెండు రోజుల కిందట ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. 2019లో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పతనం అయిపోతున్నట్లుగా తనదైన శైలిలో జోస్యం చెప్పేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాభవం బాగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నదని కూడా సెలవిచ్చారు. దీనిపై తెలుగుదేశంలో ప్రకంపనలు రేగుతున్నాయి. అయితే రామోజీ రావు మనవరాలి పెళ్లి వేదిక వద్ద తెలంగాణ మరియు ఏపీ లకు చెందిన ముఖ్యమంత్రులు - మంత్రులు అనేకమంది హాజరయ్యారు. సీఎంలు ఇద్దరూ రామోజీ సమక్షంలో చాలాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. వారి మధ్య కేసీఆర్ జోస్యం టాపిక్ వచ్చిందో లేదో తెలియదు గానీ.. ఏపీకి చెందిన కొందరు మంత్రులు- తెలంగాణ కేబినెట్ లోని తమకు పరిచయస్తులు, మిత్రులు అయిన వారిని ఈ విషయమై అడిగినట్లు సమాచారం. ‘మీ తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి జోస్యం చెప్పుకున్నారు. మేమేమైనా మాట్లాడామా? మరి మారాష్ట్రం గురించి కూడా మేం ఓడిపోతాం అంటూ చెప్పడం ఎందుకు?’ అంటూ నిలదీసినట్లు సమాచారం.

దీనికి తెలంగాణ మంత్రులు చాలా లౌక్యంగా.. ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని , అసలు తమ బాస్ కేసీఆర్ కు అలాంటి వివరాలు చెప్పిన మిత్రుడు ఎవరో కూడా తమకు తెలియనే తెలియదు అని.. ఆ సర్వే ఫలితాల విషయమై తమను ఏమీ అడగొద్దని చెప్పినట్టుగా తెలుస్తున్నది. కేసీఆర్ ఏదో తనకు తోచినట్లుగా ప్రెస్ మీట్ లో చెప్పేయగా, ఆ మాటలకు తెలంగాణ మంత్రులు సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చినట్లున్నది పాపం..!!