Begin typing your search above and press return to search.

సీమాంధ్రులకు పట్టిన అసలు దరిద్రం ఏమిటి?

By:  Tupaki Desk   |   11 Sep 2016 5:30 PM GMT
సీమాంధ్రులకు పట్టిన అసలు దరిద్రం ఏమిటి?
X
గతంలో సీమాంధ్ర నేతలంటే చాలు గౌరవంగా చూడటమే కాదు.. భయభక్తుల్ని ప్రదర్శించేవారు. దరిద్రమేమంటే.. ఇప్పుడా పరిస్థితే లేదు. గతంలో రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాల్లో ఉంటే.. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు.. వ్యాపారవేత్తలే రాజకీయాలు చేయటంతో సీమాంధ్ర నేతల్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. తెలంగాణకు చెందిన నేతల్ని.. వారి మాటల్ని వినండి.. వారికి వారి రాష్ట్రం తర్వాతే ఎవరైనా.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నే చూడండి.. ఇప్పుడైతే మోడీని పొగుడుతున్నారు కానీ కాస్త తేడా వస్తే చాలు.. ఢిల్లీ వీధుల్లో దీక్ష చేస్తానంటూ సీరియస్ గా మాట్లాడటాన్ని మర్చిపోకూడదు. రోహిత్ వేముల ఇష్యూ నడుస్తున్న వేళ.. సాక్ష్యాత్తు కేంద్రమంత్రి ఫోన్లు చేస్తుంటే లైన్లోకి రాని తత్వం కేసీఆర్ సొంతం. ఆయన లైన్లోకి రాకపోవటంపై కేంద్రమంత్రి నిష్ఠూరం ఆడారు కానీ.. అంతకు మించి ఏమీ చేయలేకపోయారు.

కేసీఆర్ అలా ఎందుకు చేశారు? అలా చేయటం తప్పా? ఒప్పా? లాంటి చర్చల్ని పక్కన పెడితే.. ఆయనేం అనుకున్నారో అదే చేయటం కనిపిస్తుంది. కానీ.. ఏపీ నేతల్ని.. వారి మాటల్ని.. చేష్టల్ని చూస్తే అలాంటిదేమీ కనిపించదు. నంగి..నంగిగా మాట్లాడటం.. కేంద్రం అంటే విపరీతమైన భయభక్తుల్ని ప్రదర్శించటం.. కేంద్రం దన్ను లేకపోతే తమ బతుకులు నాశనమైపోతాయన్నట్లుగా వ్యవహరించటం.. వారికి అణిగిమణికి ఉండటం లాంటివి కనిపిస్తాయి.

ఎందుకిలా అంటే.. కేసీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉద్యమం ఉంటే.. ఏపీ నేతల బ్యాక్ గ్రౌండ్ లో వ్యాపారాలు.. పరిశ్రమలు కనిపిస్తాయి. ప్రపంచంలో ఎవరికి శత్రువు కాకుండా ఉండటానికి ప్రయత్నించేది ఒక్క వ్యాపారస్తుడు మాత్రమే. అందరికి కొమ్ము కాస్తూ.. తన ప్రయోజనాల్ని పూర్తి చేయాలనుకుంటాడు. ఇందుకోసం ఎవరితోనైనా.. ఎంతకైనా సరే రాజీకి సిద్ధంగా ఉంటారు. తన ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉంటే చాలన్న ధోరణి వ్యక్తమవుతుంది. ఈ తత్వమే ఏపీ నేతల్లో కనిపిస్తుంది. అదే.. ఏపీకి పట్టిన దరిద్రంగా చెప్పాలి. ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలు.. వ్యాపారస్తుల్ని రాజకీయాలకు దూరంగా పెడతారో అప్పుడే ఏపీ బాగుపడుతుదని చెప్పటంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.