Begin typing your search above and press return to search.

ప్యాకేజీ తీసుకుని హోదాపై పోరాడతారట!

By:  Tupaki Desk   |   8 Sep 2016 4:29 AM GMT
ప్యాకేజీ తీసుకుని హోదాపై పోరాడతారట!
X
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషమని.. సాంకేతిక కారణాలతో అది కుదరనప్పుడు హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించేశారు. ఇదే విషయాన్ని ముందు ప్రకటించిన అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు హోదా విషయంలో గట్టిగా ఉండటంకంటే, ముందుగా ఇప్పుడొస్తున్న వాటిని తీసుకుంటూ ఆ విధంగా ముందుకుపోవాలని నిర్ణయించారు. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ అనంతరం తీవ్ర స్థాయిలో డిస్కషన్స్ నడుస్తున్న తరుణంలో చంద్రబాబు విలేఖరుల సమావేశం అని స్క్రోలింగులు రాగానే ఏవేవో వూహించుకున్నారు ఏపీ ప్రజలు.

అరుణ్ జైట్లీ హోదాకు మంగళం పాడి - ఆంధ్రప్రజల నెత్తిన టోపీ పెట్టి.. నాడు పార్లమెంటులోనూ, తిరుపతి సభలోనూ ప్రజలకు ఇచ్చిన మాటను గాలిమాటగా చేసేసిన తరుణంలో... చంద్రబాబు ప్రెస్ మీట్ అనగానే "ఇక పోరాటమే" అని అంతా భావించారు! అయితే అప్పటివరకూ ఏపీవాసులు ఊహించిందొకటి - అనంతరం జరిగిందొకటి. రాని హోదా గురించి పోరాడేకన్నా - వచ్చిన ప్యాకేజీలతో ముందుకుపోవడం మంచిదని బాబు షాకిచ్చారు. ప్రస్తుతానికి కేంద్రం నుంచి ఏదో రూపంలో నిధులు రానుండటం సంతోషం అని చెబుతూ.. ఇంకా కావలి, ఇంకా చేయాలి అనే మాటలు మాత్రం మాట్లాడారు.

ఈ విషయంపై కేంద్రంలోని బీజేపీ - రాష్ట్రంలోని టీడీపీ పెద్దలు ఏపీ ప్రజలను మోసం చేశారని క్లారిటీ వచ్చేస్తున్న తరుణంలో.. మరోసారి నయవంచనకు కొందరు నేతలు పథకాలు రచిస్తున్నారట. పోరాడితే వచ్చేదేమీ లేదు ప్యాకేజీ తప్ప అని ఫిక్సయిపోయిన నేతలు - ముందుగా కేంద్రం ఇచ్చింది తీసేసుకుంటూనే హోదాపై పోరాడదామని.. మరోసారి వంచన మాటలు మాట్లాడుతున్నారట. చంద్రబాబు మాటలు కూడా ఈ మేరకు.. ఈ టైంలో వచ్చిందే కట్నం అని సర్ధుకుపోవడంపై కూడా ప్రజలు ఆవేదనలో ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒకసారి కేంద్రం చెప్పిన దానికి తలాడించి, ఇచ్చిన ప్యాకేజీకి సర్ధుకుపోయి చల్లని కబుర్లు చెప్పిన తర్వాత ఇంక పోరాడేది ఏముంటుందనేది పలువురి ప్రశ్న. ఒకసారి హోదా స్థానంలో ప్యాకేజీ ఇస్తున్నామని కేంద్రం ప్రకటించాక, ఆ ప్రకటన విషయంలో బసవన్న అవతారం ఎత్తేశాక... మరలా హోదాకోసం పోరాడతాం అని చెబుతుంటే ఏమనుకోవాలి. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాడికైనా ఇక్కడ అర్ధమయ్యే విషయం ఒకటే.. "హోదాయే కావాలంటే మరి ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారు?.. హోదా ఇవ్వడంలేదు కాబట్టే కదా, ప్యాకేజీ ఇచ్చింది" అని కేంద్రం తిరిగి ప్రశిస్తుందని. ఆమాత్రం ఇంగితం ప్రజలకు లేదనేది ఆ నేతల ఆలోచనో ఏమో కానీ... "ప్యాకేజీ తీసుకున్నా.. హోదాపై పోరాటం చేస్తామని, ఆ విషయంలో తగ్గేది లేదని" చెప్పడాన్ని హాస్యం అనుకోక మరేమనుకోవాలి?