Begin typing your search above and press return to search.

ఇకపై.. ఏపీ ఎమ్మెల్యేల జీతం రూ.2లక్షలు

By:  Tupaki Desk   |   26 March 2016 11:30 AM GMT
ఇకపై.. ఏపీ ఎమ్మెల్యేల జీతం రూ.2లక్షలు
X
ప్రజాసేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకునే నేతలు.. తమ జీతాలు పెంచుకునే విషయం వచ్చినప్పుడు తాము చెప్పిన మాటల్ని అస్సలు గుర్తు పెట్టుకోనట్లుగా కనిపిస్తోంది. ప్రజాసేవ కోసం వచ్చినప్పటికీ ఒక్కసారిగా తమ జీతాన్ని రూ.90వేల నుంచి ఏకంగా రూ.2లక్షలకు పెంచుకోవటానికి సిద్ధం కావటం ఆసక్తికరంగా చెప్పాలి.

ధనికరాష్ట్రమైన తెలంగాణలో ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుల కుప్ప అయిన ఏపీలో.. జీతాలు ఇవ్వటానికి సైతం అప్పులు చేసుకునే దుస్థిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారం భారీగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. తెలంగాణలో ఎమ్మెల్యేలకు పెరిగే జీతాలు.. సదుపాయాలకు అనుగుణంగా ఏపీ ఎమ్మెల్యేలు కూడా తమ జీతాల పెరగాలనుకోవటం కనిపిస్తోంది.

తాజాగా ఏపీ అసెంబ్లీ ఎమెనిటీస్ కమిటీ సమావేశమై సభకు స్పష్టమైన సిఫార్సులు చేసింది. తాజాగా చేసిన సిఫార్సుల ప్రకారం ఇప్పటివరకూ ఉన్న ఎమ్మెల్యేల జీతాలు రూ.90వేల నుంచి రూ.2లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో రూ1.5లక్షలు వేతనం కాగా.. రూ.50వేలు అలవెన్సులుగా అందజేయాలని సూచించారు.

ఇక.. ఎమ్మెల్యేలకు ఇచ్చే వాహన రుణాన్ని సైతం రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలన్న సిఫార్పు చేసింది. కమిటీ చేసిన సిఫార్సుల్ని సభ ఆమోదించిన మరుక్షణం ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ సభ్యుల జీతాలు పెరగనున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. తమ శ్రేయస్సు చూసుకునే విషయంలో ఏపీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదన్నది అర్థమవుతుంది.