Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల అసంతృప్తిని గమనించారా?

By:  Tupaki Desk   |   9 Sep 2016 9:32 AM GMT
ఏపీ మంత్రుల అసంతృప్తిని గమనించారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టిస్తూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్ర‌క‌ట‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టాయి. అయిఏత వీరికి తోడుగా రాష్ట్ర మంత్రుల్లోనూ అసంతృప్తి ప్రారంభం అయిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రుల్లో ఇది స్పష్టంగా క‌నిపించ‌డం ఆసక్తిక‌రం.

శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొద‌టిరోజుతో పాటు రెండో రోజు సైతం స‌భ‌ పలుమార్లు వాయిదా పడింది. ఉదయం ప్రశ్నోత్తరాల‌ సమయం పూర్తయిన దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సభ్యులు కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు నిరసనగా నినాదాలు మొదలుపెట్టారు. దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఆ సమయంలో పలువురు మంత్రులు - కొందరు సీనియర్ శాసనసభ్యులు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ - జైట్లీ చేసిన ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదని పెదవి విరిచారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వదలుచుకోనపుడు కనీసం దశాబ్దాలుగా డిమాండ్‌ లో ఉన్న విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అయినా ప్రకటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా, రాజధాని నిర్మాణానికి ఏ మేరకు నిధులు అందుతుంది? వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ఇపుడు ఇస్తున్న ప్యాకేజీకన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తారా అన్న విషయంపైన కూడా జైట్లీ స్పష్టత ఇవ్వకపోవటం బాగా నిరాశ‌పరిచినట్లు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చేయబోయే సాయం - ప్రకటించబోయే ప్యాకేజిపై బుధవారం ఉదయం నుంచి కేంద్రమే మీడియాకు లీకులు ఇచ్చి చివరకు అర్ధరాత్రికి అటువంటి విషయాలపై కేంద్ర మంత్రి కనీస మాత్రమైనా స్పందిచకపోవటం బాగాలేదన్నారు. అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించిన జైట్లీ అందించనున్న ప్రత్యేక సాయంపై రెండు రోజుల్లో వెబ్‌ సైట్‌ లో చూసుకోమని చెప్పటంపై పలువురు మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రజానీకం యావత్తు కేంద్ర మంత్రి ప్రకటన కోసం ఎదురు చూస్తున్న సమయంలో మంత్రి చేసిన ప్రకటన అందరి ఉత్సాహాన్ని నీరుగార్చిందని వాపోయారు. రాష్ట్రంలోని ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం గ్రహించ లేకపోతోందని మంత్రులు మండిపడుతున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కానపుడు ఇవ్వదలచుకున్న ప్రత్యామ్నాయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏడాదిన్నర క్రితమే ప్రత్యామ్నాయ ప్యాకేజీని ప్రకటించాల్సిన కేంద్రం ఇంతకాలం విషయాన్ని నాన్చటం ఏమీ బాగాలేదని పెదవి విరుస్తున్నారు.