Begin typing your search above and press return to search.

ఊరెళ్లెందుకు న‌డిచే ఓపిక లేక ఆర్టీసీ బ‌స్సు చోరీ!

By:  Tupaki Desk   |   23 May 2020 11:30 AM GMT
ఊరెళ్లెందుకు న‌డిచే ఓపిక లేక ఆర్టీసీ బ‌స్సు చోరీ!
X
లాక్‌డౌన్‌ తో ప్ర‌జ‌లు ఎక్క‌డి వార‌క్క‌డ అయిపోయారు. ఇప్పుడు ఆంక్ష‌లు, నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో ప్ర‌జా ర‌వాణా ప్రారంభ‌మైంది. కానీ అంత‌ర్రాష్ట్ర ర‌వాణా మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న‌వాళ్లు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో కొంద‌రు న‌డుచుకుంటూ వెళ్తున్నారు. ఇలాగే ఓ వ్య‌క్తి న‌డుచుకుంటూ బ‌య‌ల్దేర‌గా ఓపిక న‌శించింది. దీంతో ప‌క్క‌న ఆపి ఉన్న ఆర్టీసీ బ‌స్సు క‌నిపించింది. ఇక దాన్ని ఎక్కి ఎంచ‌క్కా ఊరెళ్లి పోవ‌చ్చ‌ని బ‌స్సును తీసుకెళ్లాడు. అయితే ఈ ఘ‌ట‌న‌పై వెంటనే పోలీసులు స్పందించడంతో ఆర్టీసీ బ‌స్సును స్వాధీనం చేసుకుని అత‌డిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న అనంతపురము జిల్లా ధర్మవరంలో జ‌రిగింది

ఆర్టీసీ డిపోలో ప‌ని చేస్తున్న డ్రైవ‌ర్ భోజ‌నం కోసం ఆర్టీసీ బస్సు (ఏపీ02జెడ్ 0552) నిలిపాడు. అయితే కర్ణాటకలోని విజయపురకు చెందిన వ్య‌క్తి ముజామిల్‌ఖాన్ ధ‌ర్మ‌వ‌రంలో బంధువుల ఇంటికి వ‌చ్చి చిక్కుకుపోయాడు. తిరిగి సొంత ప్రాంతానికి వెళ్లేందుకు బ‌స్సులు లేవు. అంత‌ర్రాష్ట్ర ర‌వాణా ఇంకా ప్రారంభం కాక‌పోవ‌డంతో అత‌డు సొంత ప్రాంతానికి కాలిన‌డ‌క‌న బ‌య‌ల్దేరాడు. కొద్దిదూరం వ‌చ్చాక కాళ్లు నొప్పులు వ‌చ్చాయి.. ఓపిక లేదు. ఈ స‌మ‌యంలో భోజనం కోసం బ‌స్సును నిలిపి వెళ్లిన విష‌యాన్ని గుర్తించాడు. వెంటనే ముజామిల్‌ ఖాన్ బ‌స్సును తీసుకుని డిపో నుంచి బ‌య‌ల్దేరాడు. దాదాపు 40 కిలోమీటర్ల దూరం వరకు బస్సుని తీసుకెళ్లాడు.

ఈ విషయాన్ని డిపో సెక్యూరిటీ కానిస్టేబుల్ గుర్తించి వెంట‌నే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమ‌య్యారు. జీపీఎస్ ద్వారా బ‌స్సు మామిళ్లపల్లి మీదుగా జాతీయ రహదారిపై బస్సు వెళ్తున్నట్లు గుర్తించారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు బస్సును వెంబడించారు. కియా పరిశ్రమ దగ్గర ఎర్రమంచి పోలీసులను అప్రమత్తం చేయడంతో జాతీయ రహదారిపై కంటైనర్‌ వాహనాలను అడ్డు పెట్టించి బ‌స్సును అడ్డ‌గించారు.

పోలీసులు అడ్డుకోవ‌డంతో ఇక మార్గంలేక ముజామిల్‌ఖాన్‌ బస్సు నిలిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంట‌నే పోలీసులు అతడిని పట్టుకున్నారు. అత‌డిని ధర్మవరం పోలీసుల‌కు అప్ప‌గించారు. విచార‌ణ చేయ‌గా సొంతూరికి ఎలా వెళ్లాలో తెలియ‌క‌.. ఆర్టీసీ బ‌స్సు అయితే ఎవ‌రూ ఆప‌ర‌నే ఉద్దేశంతో తీసుకెళ్లాన‌ని ముజామిల్‌ఖాన్ తెలిపాడు.