Begin typing your search above and press return to search.

కరోనా పోరులోకి 'కార్పొరేట్'..నో చెప్పడం సాధ్యం కాదంతే

By:  Tupaki Desk   |   3 April 2020 4:00 PM GMT
కరోనా పోరులోకి కార్పొరేట్..నో చెప్పడం సాధ్యం కాదంతే
X
నిజమే... ఏపీలో ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. కరోనా వైరస్ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులను సృష్టిస్తున్న వేళ... అత్యవస సేవా విభాగాలకు చెందిన ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రైవేటు రంగానికి చెందిన విభాగాలు కూడా తప్పనిసరిగా సేవలకు సిద్ధం కావాల్సిందే. అలా కాకుండా ఆర్జనకు మాత్రమే తాము ముందుంటాం.. సేవకు మాత్రం ఆమడంత దూరంగానే ఉండిపోతామంటే మాత్రం ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదైపోతాయి. ఇలాంటి సంస్థలు, వ్యక్తులు అరెస్ట్ లతో పాటు భారీ జరిమానాలను చెల్లించక తప్పని పరిస్థితులు రంగంలోకి దిగాయి. ఈ మేరకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ... కేవలం ప్రభుత్వ యంత్రాంగాలే సేవలు చేయాలని, ఆ బాధ్యతలు తమకు పట్టవన్నట్లుగా ప్రైవేట్ సంస్థలు భావిస్తున్న వేళ జగన్ నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరి సేవల నిర్వహణ చట్టం 1971 (ఎస్మా) అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా జగన్ సర్కారు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ చట్టం రాష్ట్రంలో ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని కూడా సదరు ఉత్తర్వుల్లో జగన్ సర్కారు చాలా స్పష్టంగానే చెప్పేసింది.

అయినా ఇప్పుడే... ఈ చట్టాన్ని ప్రయోగించడం, దాని పరిధిలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఆసుపత్రులను తీసుకురావడం వెనుక జగన్ చాలా కసరత్తే చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే... రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ చికిత్సల పేరిట ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రులు పెద్ద ఎత్తున చికిత్సలు చేపడుతూ భారీ ఎత్తున ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటున్నాయి. అయితే కరోనా మహమ్మారి ఎంటరైన వెంటనే అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ అంటూ ప్రకటన చేయగానే... మెజారిటీ ప్రైవేటు ఆసుపత్రులు తలుపులు మూసేశాయి. కరోనా కట్టడి చర్యలు తమకు ఎంతమాత్రం సంబంధం లేనివేనని - అదంతా ప్రభుత్వ ఆసుపత్రులుల చూసుకోవాల్సిందేనన్న రీతిలో సాగాయి. అయితే ఓ విపత్తు ముంచుకొస్తే.. ఇలా తమకేమీ పట్టనట్టు వ్యవహరించిన ప్రైవేటు ఆసుపత్రుల వైఖరిపై జగన్ కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కరోనాను కట్టడి చేయాలంటే... ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగం కూడా చేతులు కలిపితే... కరోనా చికిత్సలకు, క్వారంటైన్ లకు, చివరకు ల్యాబ్ టెస్టులకు కూడా వెసులుబాటు కలుగుతుందని జగన్ భావించారు.

అనుకున్నదే తడవుగా... కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అనుమానితులకు వైద్య పరీక్షలు, పాజిటివ్ అని తేలిన వారికి చికిత్సలు, క్వారంటైన్లు ఇలా అన్ని రకాల కార్యకలాపాలకు ప్రైవేటు ఆసుపత్రులు కూడా ముందుకు రావాల్సిందేనని ఇటీవలే జగన్ ఓ సందేశం విడుదల చేశారు. సదరు సందేశంపై ఏం నిర్ణయం తీసుకోవాలన్న దిశగా ఇంకా ఆలోచన దశలోనే ప్రైవేటు ఆసుపత్రులు ఉంటే... జగన్ ఏకంగా ఎస్మా చట్టాన్ని బయటకు తీసి... దాని పరిధిలోకి ప్రైవేటు ఆసుపత్రులనూ తీసకొచ్చేశారు. ఈ జీవోతో ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు వాటిలో పనిచేసే సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా కట్టడిలోకి దిగిపోక తప్పని పరిస్థితి. అంతేకాకుండా కేవలం ప్రైవేట్ ఆసుపత్రులను మాత్రమే కాకుండా... వైద్య సర్వీసులు - డాక్టర్లు - నర్సులు - ఆరోగ్య సిబ్బంది - ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది - వైద్య పరికరాల కొనుగోలు - నిర్వహణ - రవాణా - మందుల కొనుగోలు - రవాణా - తయారీ - అంబులెన్స్‌ సర్వీసులు - మంచినీరు - విద్యుత్‌ సరఫరా - భద్రత - ఆహార సరఫరా - బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్ మెంట్ ను కూడా ఎస్మా పరిధిలోకి తెచ్చింది. దీంతో ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్జనకు మాత్రమే సిద్ధం... సేవలకు మాత్రం సెలవేనని చెప్పేందుకు అవకాశం లేదన్న మాట.