Begin typing your search above and press return to search.

రాత్రికి రాత్రే మారిన బెజవాడ పరిస్థితి..!!

By:  Tupaki Desk   |   10 Jun 2020 8:10 AM GMT
రాత్రికి రాత్రే మారిన బెజవాడ పరిస్థితి..!!
X
లాక్ డౌన్ ..వైరస్ మహమ్మారిని అరికట్టడం కోసం విధించారు. కానీ, దేనికోసమైతే లాక్ డౌన్ విధించారో ... దాన్ని పూర్తిగా సాధించకముందే సడలింపులు ఇచ్చేసారు. అలాగే , అన్‌ లాక్ 1.0తో మాల్స్ - రెస్టారెంట్లు - ఆలయాలు కూడా తెరిచారు. అయితే , లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తరువాతే పాజిటివ్ కేసులు రోజురోజుకి ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు తొలగించిన తరువాత ఏపీలో ఈ వైరస్ మరింతగా విజృంభిస్తుంది.

ముఖ్యంగా రాష్ట్రానికి వ్యాపార రాజధానిగా పేరున్న విజయవాడలో వైరస్ కేసులు హడలెత్తిస్తుండటంతో కృష్ణా జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో వైరస్ కేసులు పెరుగుతున్నాయని, దీంతో 42 జోన్లను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. నగరంలో 64 డివిజన్లు ఉన్న సంగతి తెలిసిందే. కనకదుర్గ గుడి ప్రాంతం కూడా కంటైన్ మెంట్‌ జోన్‌ లోకే వస్తుండటం గమనార్హం. లాక్ డౌన్ నిబంధనలు కంటైన్మెంట్ జోన్లలో కూడా వర్తిస్తాయని కలెక్టర్ తెలిపారు. అక్కడ ఉంటున్న ప్రజలు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కంటైన్ మెంట్ జోన్లు మెడికల్ - రెవెన్యూ - పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.

దీనితో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రకటన వెల్లడించే వరకు విజయవాడలో లాక్ డౌన్ అమలులో ఉంటుందన్నారు. కాగా, ఏపీ డిజాస్టర్ మేనేజ్‌ మెంట్‌ యాక్ట్ 2005 ప్రకారం ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా, గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 216 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ సోకి ఇద్దరు చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 147 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 69 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో వైరస్ మొత్తం కేసుల సంఖ్య 3 వేల 990కి చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 77కి చేరింది.