Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నాటకం అదిరింది

By:  Tupaki Desk   |   7 Sep 2015 9:56 AM GMT
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నాటకం అదిరింది
X
చేయాల్సిందంతా చేసేసి.. ఈ రోజు ఆందోళనలు అంటూ కొత్త నాటకానికి తెర తీస్తున్నట్లుగా ఉంది ఏపీ కాంగ్రెస్ నేతల తీరు. చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా విభజన చేసినప్పుడు.. పెదవి విప్పకుండా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మాత్రం ప్రధాని మోడీ మీద.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మండిపడుతున్నారు.

విభజనతో ఏపీని ఎంత నష్టపర్చాలో అంత నష్టపర్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పడు మాత్రం ఏపీకి న్యాయం చేయాలంటూ గొంతులు చించుకుంటున్నారు. హేతబద్ధంగా విభజన చేయటం లేదని గొంతు చించుకున్నప్పుడు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించిన వారు.. ఇప్పుడు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోలీస్ స్టేషన్ ల వద్దకు బారులు తీస్తున్నారు. సోమవారం.. ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు.. వారి వారసులతో కలిసి ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఫిర్యాదులు చేసేందుకు పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బీజేపీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పటంతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ.. పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తున్నారు. నిజానికి పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదుల కార్యక్రమం అంతా ఒట్టి ఫార్సు అని చెప్పక తప్పదు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న విషయంలో మోడీ సర్కారుకు ఏ విధంగా అయితే కమిట్ మెంట్ లేదో.. అదే తీరు కాంగ్రెస్ కు ఉందన్న విషయం మర్చిపోకూడదు. నిజంగా కాంగ్రెస్ కానీ.. ఏపీకి ప్రత్యేకహోదా గురించి పోరాడాలనుకుంటే.. భూసేకరణ చట్టం మీద దేశ వ్యాప్తంగా ఆందోళన చేసి.. పార్లమెంట్ ను స్తంభించిపోయేలా చేసిన కాంగ్రెస్.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం మాత్రం అలాంటిదేమీ చేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అధినాయకత్వం చేత అలాంటి పనులు చేయించని ఏపీ కాంగ్రెస్ నేతలు.. పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులనే డ్రామాను మాత్రం ఓ రేంజ్ లో చేస్తున్నారని చెప్పక తప్పదు.