Begin typing your search above and press return to search.

5 లక్షల కోట్ల మాట చట్టంలో ఎందుకు పెట్టలేదో?

By:  Tupaki Desk   |   15 March 2016 5:02 AM GMT
5 లక్షల కోట్ల మాట చట్టంలో ఎందుకు పెట్టలేదో?
X
ఏపీ కాంగ్రెస్ నేతలు తాజాగా ఢిల్లీలో హడావుడి చేస్తున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం వారంతా దేశ రాజధానిలో హడావుడి చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ఏపీ ప్రయోజనాల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు.. మొదటి రోజున రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి.. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం గురించి ఏకరవు పెట్టుకున్నారు. విభజన బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ కాంగ్రెస్ నేతలు కష్టాన్ని చూస్తే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్క అసెంబ్లీలో స్థానం కల్పించకున్నా.. ఏపీ ప్రయోజనాల కోసం వారుపడుతున్న కష్టం చూస్తే.. ఏపీ మీద.. ఏపీ ప్రజల మీద ఎంత ప్రేమ అనిపించక మానదు. రాష్ట్రపతిని కలిసి.. ఏపీ ప్రయోజనాల గురించి తమ వాదన వినిపించి.. విభజన హామీల్ని అమలుచేసేందుకు వీలుగా రూ.5లక్షల కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేయటం కనిపిస్తుంది.

ఏపీ మీద అంత ప్రేమే ఉంటే.. విభజన బిల్లును పార్లమెంటుకు తెచ్చిన సందర్భంలోనే.. ఏపీ నేతలు పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి ఎందుకు పెట్టించుకోనట్లు? విభజన కారణంగా ఏపీకి జరిగే అన్యాయం తీవ్రంగా ఉంటుందని నాడు అందరూ మొత్తుకున్నా.. పార్టీ అధినేత్రి అడుగులకు మడుగులు ఎత్తిన ఏపీ కాంగ్రెస్ నేతలు కిక్కురమనలేదు. అధినేత్రిని నిలదీయలేదు. నాడు నోరు మూసుకొని ఉన్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడేదో ఏపీ మీద తమకు ప్రేమ కారిపోతుందంటూ రాష్ట్రపతిని కలిసి హడావుడి చేస్తున్న వైనం చూస్తే కామెడీగా అనిపించక మానదు. కొంప కాలిపోతున్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించిన ఏపీ కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు కాలిపోయిన కొంప స్థానంలో రాజభవనం కట్టాలన్నట్లుగా చేస్తున్న డిమాండ్ చూస్తే ఆశ్చర్యం కలగటం ఖాయం. అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మీద లేని ప్రేమాభిమానాలు.. పవర్ పోగొట్టుకున్నాక మాత్రం అంతులేని ప్రేమను ప్రదర్శించటం ఏపీ కాంగ్రెస్ నేతలకే చెల్లుతుందేమో..?