Begin typing your search above and press return to search.

మరో భగీరథ ప్రయత్నం మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   19 Aug 2020 7:34 AM GMT
మరో భగీరథ ప్రయత్నం మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వం
X
ఎప్పుడొచ్చామన్నది కాదు.. సమస్యలు పరిష్కరించామా కాదా అన్నదే ముఖ్యం.. ఇప్పుడు ఏపీ సీఎం అదే చేస్తున్నారు. సైలెంట్ గా మీడియా ప్రచారం లేకుండానే ఏపీలో దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యను పరిష్కరిస్తున్నారు. నాయకులు మారినా తలరాతలు మారని ఉద్దానం కిడ్నీ బాధితుల భవిష్యత్ ను మార్చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్రీకారం చుట్టారు. సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మేఘా సంస్థ సహకారంతో ఉద్దానంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం త్వరగా పూర్తి చేయడం ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు జగన్ సర్కార్ పరిష్కారం చూపబోతోంది.

ఏళ్లుగా ఉద్దానంను పట్టిపీడిస్తున్న సమస్య..

ఉద్దానంలో కిడ్నీ సమస్య 1985-86 ప్రాంతాల్లోనే బయటపడింది. 1990 దశకంలో ఈ సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికంగా ఆందోళనలు చేపట్టారు. అయితే నాటి పాలకులు ఈ సమస్యను తేలికగా తీసుకోవడం రోజురోజుకు కిడ్నీ వ్యాధి బారినపడే వారి సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో నాటి పాలకులు తాత్కాలిక ఉపశమ చర్యలు తీసుకున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్దానం గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు దృష్టిసారించారు. ఆ గ్రామాల్లోని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా సమస్యను పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణంతో ఈ సమస్య అలాగే ఉండిపోయింది.

కిడ్నీ బాధితులకు అండగా జగన్ సర్కార్..

శ్రీకాకుళం జిల్లాలోని పలాస - ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు - కవిటి - సోంపేట - కంచిలి - ఇచ్చాపురం - పలాస - వజ్రపుకొత్తూరు - మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. 107 గ్రామాల్లో 1.3లక్షల జనాభాను పరీక్షిస్తే 14 వేల మంది కిడ్నీ బాధితులు తేలారు. కవిటి మండలం లో కిడ్నీ బాధితుల సంఖ్యా ఎక్కువగా ఉంది. ఉద్దానం లో కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 10వేల మంది మరణించి ఉంటారని ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వారి అంచనా. ఉద్దానం పరిధిలోని ప్రతీ గ్రామం లో రెండు రోజులకు ఒకరు కిడ్నీ సమస్య తో మరణిస్తుంటారని ఓ అంచనా.

దశాబ్ధాల సమస్యకు జగన్ చరమగీతం

సీఎం జగన్ దశాబ్ధాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న ఉద్దానం సమస్యపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మేఘా సంస్థ సహకారంతో ఉద్దానంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం త్వరగా పూర్తి చేయడం ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితులకు జగన్ సర్కార్ అండగా నిలువనుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ సర్కార్ చిత్తశుద్ధితో ఉద్దానం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముందుకొచ్చింది. ఉద్దానంలో శాశ్వత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయటంతోపాటు - పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ. 700కోట్ల అంచనాలతో ఈ పథకాన్నిడిజైన్ చేసి రూ.530కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగులో రూ.527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు.

సుమారు 100 కిలోమీటర్ల నుంచి తాగునీరు...

ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ చేపడుతున్న మంచి నీటి పథకం పనులను త్వరలోనే ప్రారంభించేందుకు మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సన్నాహాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపించనుంది. మేఘా సంస్థ ఇప్పటికే తాగునీటి రంగంలో అనేక ప్రపంచస్థాయి రికార్డులను నెలకొల్పింది. నిర్ణిత సమయంలో అతిపెద్ద ప్రాజెక్టులు పూర్తిచేసిన రికార్డు మేఘా పేరిట ఉంది. దీంతో ఈ పథకం కూడా నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందని ఏపీ ప్రభుత్వ అధికారులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు తాగునీటి అవసరాలకు ఎక్కువగా బోరు నీటిపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంత భూగర్భ జలాల్లో కిడ్నీ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్న కారకాలు ఉన్నట్టు నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్‌ నుంచి భూగర్భ పైపు లైను ద్వారా నీటిని తరలించనుంది. మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు తరలిస్తారు. వీటి ద్వారా ప్రతీ ఇంటికి ఈ నీటిని అందిస్తారు.

దశాబ్దాల గోసను పరిష్కరిస్తున్న సీఎం జగన్-మేఘా సంస్థ

వీటన్నింటిని పరిశీలించి సీఎం జగన్ సమస్యను తీవ్రతను గుర్తించారు. బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా జగన్ సర్కార్ మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా మేఘా సంస్థ ఈ పథకాన్ని పూర్తి చేయాలని సంకల్పించింది. దశాబ్దాలుగా ఉద్దానం బాధితులు అనుభవిస్తున్న బాధకు శాశ్వతంగా మోక్షం లభించనుండటంపై బాధిత గ్రామాల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.